న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బాస్ సౌరవ్ గంగూలీ చెప్పిందే నిజమైంది. సెప్టెంబర్లో జరగాల్సిన ఆసియాకప్ 2020 వచ్చే ఏడాదికి వాయిదాపడింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) గురువారం అధికారికంగా ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఏసీసీ తమ ప్రకటనలో పేర్కొంది.
'షెడ్యూల్ ప్రకారమే ఆసియాకప్ నిర్వహించడానికి బోర్డు అన్ని విధాల ప్రయత్నించింది. కానీ కరోనా నేపథ్యంలో ఆయా దేశాలు విధించిన ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్ నిబంధనలు, ఫండమెంటల్ హెల్త్ రిస్క్, భౌతిక దూరం వంటి అంశాలు టోర్నీ నిర్వహణకు సవాళ్లుగా మారాయి. వీటిన్నటికంటే టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ళు, సహాయక సిబ్బంది, కమర్షియల్ పార్ట్నర్స్, అభిమానులు, యావత్ క్రికెట్ సమాజం యొక్క ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని టోర్నీ వాయిదావేయడమే ఉత్తమమనిపించింది. వారి ప్రాణాలను రక్షించడం తమ బాధ్యతని భావించింది. ఈ నేపథ్యంలోనే శ్రీలంక వేదికగా 2021 జూన్లో టోర్నీ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి తగిన విండో పొందటానికి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది'అని ఏసీసీ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.
వాస్తవానికి ఈ ఏడాది ఆసియాకప్ను పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాల్సింది. కానీ పాక్ వెళ్లి ఆడేందుకు భారత్ ఒప్పుకోవడంతో ఓ దశలో తటస్థ వేదికగా దుబాయ్ వేదికగా నిర్వహించాలనుకుంది. అనంతరం శ్రీలంకతో స్వాప్ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది శ్రీలంకలో వచ్చే ఏడాది పాక్లో జరిపేలా ఒప్పందం చేసుకుంది. కానీ కరోనా పుణ్యమా ఈ ఏడాది ఆసియాకప్ అటకెక్కింది.
ఇక ఆసియా కప్ రద్దయిందని గంగూలీ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. 'ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ తొలుత ఏ సిరీస్ ఆడుతుందని చెప్పడం కష్టం. కరోనా వైరస్ ఎప్పుడు అంతం అవుతుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మనం వేచి చూడక తప్పదు. ఇప్పటికే స్టేడియాలు ఓపెన్ అయినా వైరస్ భయంతో క్రికెటర్లు వెళ్లడం లేదు. కాబట్టి భారత్లో క్రికెట్ రీస్టార్ట్ విషయంలో మాకు తొందరలేదు. సెప్టెంబర్లో జరగాల్సిన ఆసియాకప్ రద్దయింది. కాబట్టి భారత్లో క్రికెట్ ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేం'అని దాదా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ధోనీ భాయ్.. ఆ క్షణమే నీలో ఓ అన్నయ్యను చూసుకున్నా.. భావోద్వేగ లేఖతో కేదార్ విషెస్!