టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్పై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. టీ20ల్లో సెంచరీ చేస్తేనే టెస్ట్ టీమ్లోకి తీసుకుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్ గురైన సంగతి తెలిసిందే.
ఈ ఘోర పరాజయం నేపథ్యంలో గంభీర్, అగార్కర్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆటగాళ్ల ఎంపిక సరిగ్గా లేకపోవడమే ఈ ఘోర పరాజయానికి కారణమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా వంటి సీనియర్ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయలేకపోతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పే గంభీర్.. రంజీ క్రికెట్లో సుదీర్ఘ కాలంగా రాణిస్తున్న ఆటగాళ్లను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న అభిమన్యు ఈశ్వరన్కు భారత సెలెక్టర్లు అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు 109 రంజీ మ్యాచ్లు ఆడిన ఈ బెంగాల్ కెప్టెన్ 47.85 సగటుతో 8136 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు ఉన్నాయి. భారత్-ఏ జట్టులో భాగంగా ఉన్న అభిమన్యు ఈశ్వరన్.. ఆ జట్టుకు సారథిగా కూడా వ్యవహరించాడు. 2021లో తొలిసారి టీమిండియా టెస్ట్ టీమ్ పిలుపును అందుకున్న అభిమన్యు ఈశ్వరన్.. ఇప్పటి వరకు అరంగేట్ర క్యాప్ అందుకోలేకపోయాడు. అతని తర్వాత చాలా మంది ఆటగాళ్లు జట్టులోకి వచ్చి వెళ్లిపోయారు.
తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ సాధించాడు. పంజాబ్తో హైదరాబాద్లోని జింఖాన మైదానం వేదికగా గత ఆదివారం జరిగిన మ్యాచ్లో అభిమన్యు ఈశ్వరన్ 66 బంతుల్లో 133 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మరే బ్యాటర్ కూడా 9 పరుగుల కంటే ఎక్కువ చేయలేదు. అభిమన్యు సెంచరీని ప్రస్తావిస్తూ అశ్విన్.. గంభీర్, అగార్కర్లపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. టీ20ల్లో సెంచరీ చేశాడు కాబట్టి అభిమన్యు ఈశ్వరన్కు టీమిండియా టెస్ట్ టీమ్లో అవకాశం దక్కుతుందని చెప్పాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా విమల్ కుమార్ అనే స్పోర్ట్స్ జర్నలిస్ట్తో మాట్లాడిన అశ్విన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'నేను మరో ఆటగాడి గురించి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. అతను ఎవరో కాదు.. మనం ఎప్పుడూ చర్చించుకునే టెస్ట్ జట్టులోని ప్రస్తుత ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్. తాజాగా అతను టీ20లో కూడా సెంచరీ చేశాడు. ఇప్పుడు అతనికి భారత టెస్ట్ టీమ్లో అవకాశం దక్కవచ్చు. టీ20ల్లో సెంచరీ చేస్తే టెస్ట్ టీమ్లో కచ్చితంగా అవకాశం లభిస్తోంది.'అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ యాష్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.