టీమిండియా తాత్కలిక టెస్ట్ కెప్టెన్ రిషభ్ పంత్పై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్లో ఆటగాళ్ల కన్నా ముందే రిషభ్ పంత్ చేతులెత్తేసాడని తెలిపాడు. నాలుగో రోజు సౌతాఫ్రికా బ్యాటింగ్ను ఉద్దేశించి అశ్విన్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.
'రెండో ఇన్నింగ్స్లో పుంజుకుంటామనే ఆశ నాకు ఉంది. కానీ మైదానంలో ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ తీవ్ర బాధకు గురి చేస్తోంది.'అని గుండె పగిలే ఎమోజీతో కెప్టెన్ రిషభ్ పంత్ ఫొటో పెట్టాడు. ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ రిషభ్ పంతే భుజాలు దిగేసాడనే విషయాన్ని అశ్విన్ తెలియజేశాడు.
ఈ మ్యాచ్లో భారత్ ఓటమి ముంగిట నిలిచింది. 549 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 15.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(13), కేఎల్ రాహుల్(6) దారుణంగా విఫలమయ్యారు. నైట్వాచ్మన్గా కుల్దీప్ యాదవ్(2 బ్యాటింగ్) బ్యాటింగ్కు రాగా.. సాయి సుదర్శన్(2 నాటౌట్)మరో వికెట్ పడకుండా ఆటను ముగించాడు. ప్రస్తుతం భారత్ 522 పరుగుల వెనుకంజలో ఉంది.

ఈ మ్యాచ్లో భారత్ ఓటమిని తప్పించుకోవాలంటే ఆఖరి రోజైన బుధవారం మొత్తం బ్యాటింగ్ చేయాలి. లేదంటే టీమిండియా ఘోర పరాజయం తప్పదు. సౌతాఫ్రికా విజయానికి 8 వికెట్లు కావాలి. ప్రస్తుతం సౌతాఫ్రికా బౌలర్లు ఉన్న ఫామ్ నేపథ్యంలో భారత ఓటమి పెద్ద కష్టమేం కాదనిపిస్తోంది. ఇప్పటికే పిచ్పై పగుళ్లు ఏర్పడి స్పిన్నర్లకు అడ్వాంటేజ్గా మారింది. ఆఖరి రోజు పిచ్ స్పిన్నర్లకు మరింత అనుకూలంగా మారనుంది.
అంతకుముందు 26/0 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా 78.3 ఓవర్లలో 260/5 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 288 పరుగులు కలుపుకొని మొత్తం 548 పరుగుల ఆధిక్యం సాధించింది.
సఫారీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(180 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 94) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. టోనీ డీ జోర్జీ(68 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 49) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఒక్కడే(4/62) నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్(1/67) ఒక వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ తొలి ఇన్నింగ్స్లో 201 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్ నిర్లక్ష్యపు షాట్తో వికెట్ పారేసుకున్నాడు. పంత్ కాస్త ఓపికగా ఆడాల్సిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.