పాకిస్థాన్ జట్టుపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. హ్యాండ్ షేక్ వివాదంపై పాకిస్థాన్ అనవసర రాద్దాంతం చేసిందని విమర్శించాడు. భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం గురించి చర్చ జరగకుండా ఉండేందుకు అనవసర గొడవకు తెరలేపిందని ఆరోపించింది. అనవసర ఆరోపణలతో అందరి దృష్టిని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్కు మళ్లించారని తెలిపాడు. ఆటగాళ్లతో బలవంతంగా కరచాలనం చేయించడానికి అతనేమి స్కూల్ టీచర్ కాదని అసహనం వ్యక్తం చేశాడు.
ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా భారత్తో జరిగిన లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో పాక్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ విజయానంతరం భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి డోర్ వేసుకున్నారు. తాము ఏసీసీ, ఐసీసీ రూల్స్ నేపథ్యంలోనే పాకిస్థాన్తో మ్యాచ్ ఆడుతున్నామనే సందేశాన్నిచ్చారు. ఈ ఘటనపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తమ జట్టు ప్రదర్శనను విశ్లేషించుకోవాల్సింది పోయి.. షేక్ హ్యాండ్ ఇవ్వలేదంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా సూర్యకు షేక్ హ్యాండ్ ఇవ్వదని తమ కెప్టెన్కు చెప్పిన మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై చర్యలు తీసుకోవాలని, లేకుంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది. యూఏఈతో మ్యాచ్కు ఆలస్యంగా రావడంతో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్లను బాయ్కట్ చేసింది. ఈ వివాదం నేపథ్యంలోనే భారత్, పాకిస్థాన్ జట్లు మరో మ్యాచ్కు సిద్దమయ్యాయి. సూపర్-4లో భాగంగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మాట్లాడిన అశ్విన్.. పాక్ తీరును తప్పుబడుతూ.. ఘాటైన విమర్శలు చేశాడు.
'భారత్-పాక్ పోరు ఉన్న హైప్ను భారత జట్టు ఎక్కడా తక్కువ చేయలేదు. కేవలం నిజాలను మాత్రమే చెప్పింది. సూర్యకుమార్ యాదవ్ భారత క్రికెటర్ల మనోభావాలను మాత్రమే తెలిపాడు. సమస్యంతా పాకిస్థాన్ జట్టుదే. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై పాక్ ఆందోళన చేయడం ఏ మాత్రం సరికాదు. ఓ విధంగా ఆయన పాక్ జట్టును రక్షించాడు. భారత జట్టు ముందే మ్యాచ్ రిఫరీకి తమ నిర్ణయం ఏంటో చెప్పింది. పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కానీ ఎవరూ ఈ ఓటమి గురించి మాట్లాడలేదు. అందరూ ఆండీ పైక్రాఫ్ట్ గురించే చర్చించారు. అయినా బలవంతంగా ఆటగాళ్లతో కరచాలనం చేయించడానికి అతనేమీ స్కూల్ టీచర్ కాదు. ప్రిన్సిపల్ కాదు. సూర్య వద్దకు వెళ్లి పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయమని రిఫరీ చెప్పలేడు. కాబట్టి ఇందులో పైక్రాఫ్ట్ తప్పు లేదు.'అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.