టెస్ట్ ఫార్మాట్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉండాలని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. రెడ్ బాల్ క్రికెట్ కంటే వైట్బాల్ ఫార్మాట్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్ ఆడిన బుమ్రాకు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. అప్కమింగ్ టీ20 సిరీస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా బుమ్రా గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఏబీ డివిలియర్స్తో మాట్లాడిన అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నాకు బుమ్రాతో మంచి రిలేషన్ ఉంది. ప్రస్తుతం నేను అతని దగ్గరగా ఉండి ఉంటే.. బుమ్రాకు ఒకటే మాట చెప్పేవాడిని. పరిమిత ఓవర్ల క్రికెట్కు ప్రాధాన్యతమివ్వాలని సూచించేవాడని. మరీ అవసరమైతే తప్ప టెస్ట్ క్రికెట్ ఆడవద్దని సలహా ఇచ్చేవాడిని. కానీ అతనికి సుదీర్ఘ ఫార్మాట్లో ఆడటం అంటే చాలా ఇష్టమనే సంగతి నాకు తెలుసు. అతను వీలైనంత కాలం టెస్ట్ క్రికెట్ ఆడటానికే మొగ్గు చూపుతాడు. అది సవాల్తో కూడుకున్న విషయం అని కూడా తెలుసు.

జస్ప్రీత్ బుమ్రా టీ20 క్రికెట్ ఆడాలి. అతను అర్థరహిత వన్డేలు ఆడాలని నేను కోరుకోవడం లేదు. టెస్ట్లు.. అది కూడా విదేశాల్లో జరిగే మ్యాచ్ల్లోనూ అతను ఆడాలని కోరుకుంటున్నా. టీమిండియా సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు ఇతర ఫాస్ట్ బౌలర్ల సేవల్ని ఉపయోగించుకోవాలి.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
అశ్విన్ వ్యాఖ్యలతో ఏబీ డివిలియర్స్ ఏకీభవించాడు. సొంతగడ్డపై జరిగే టెస్ట్ మ్యాచ్ల్లో బుమ్రా ఆడాల్సిన అవసరం లేదని, కేవలం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్లో జరిగే టెస్ట్ల్లోనే ఆడాలని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ నేపథ్యంలో వైట్బాల్ క్రికెట్పైనే ఫోకస్ పెట్టాలని సూచించాడు. సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్తో బుమ్రా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.