Ashish Nehra: టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలనే అంశంపై సెలెక్టర్లకు తలనొప్పి తప్పదని మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా అన్నాడు. రోహిత్ శర్మను కొనసాగించాలా? లేక హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వాలా? అనేది తేల్చుకోవడం కష్టమన్నాడు.
సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్లను అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. ఇప్పటికే ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ పర్యటనలోని పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు ఆటగాళ్లు లండన్లో విశ్రాంతి సమయాన్ని గడుపుతున్నారు.

వైట్బాల్ క్రికెట్ ఆడమని బీసీసీఐకి సమాచారమివ్వడంతో సెలెక్టర్లు వారికి విశ్రాంతినిచ్చారు. ఈ ఇద్దరూ టెస్ట్ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. వన్డే ప్రపంచకప్ 2023లో గాయపడిన హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకుంటున్నాడు. దాంతో అతన్ని సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేయలేదు. టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో కేఎల్ రాహుల్ను కెప్టెన్గా నియమించారు. టెస్ట్ల్లో రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నాడు.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఈ సిరీస్కు దూరంగా ఉండటం జట్టుకు నష్టం చేస్తుందని ఆశీష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. టీ20 కెప్టెన్సీ వ్యవహారం సెలెక్టర్లకు కఠిన సవాల్గా మారుతుందన్నాడు.
'టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మ నుంచి హార్దిక్ పాండ్యాకు అప్పగించేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడే దాని గురించి మాట్లాడలేను. సెలెక్టర్లకూ కఠిన పరీక్ష తప్పదని అనిపిస్తోంది. ప్రస్తుతం హార్దిక్ గాయం నుంచి కోలుకుంటున్నాడు.
ఎప్పుడు తిరిగి వస్తాడనేది తెలియదు. ఒకవేళ హార్దిక్ పాండ్యా నేరుగా ఐపీఎల్ ఆడితే మాత్రం.. భారత సెలెక్టర్లకు మరింత కఠినమవుతోంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని టీ20 ప్రపంచకప్లో ఆడించాలని మద్దతుగా నిలిచేవారూ ఉన్నారు. ఒకవేళ వారిద్దరూ ఫిట్గా ఉంటే మాత్రం ఫామ్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా టీ20 ప్రపంచకప్లో వారిని చూసే అవకాశం ఉంటుంది.'అని నెహ్రా చెప్పుకొచ్చాడు.