టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై మాజీ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ప్రశంసల జల్లు కురిపించాడు. ఒకవేళ బుమ్రా ఐపీఎల్ మెగావేలంలోకి వస్తే రూ.520 కోట్ల పర్స్ వాల్యూ కూడా సరిపోదన్నాడు. బుమ్రా కోసం ఖర్చు చేసేందుకు ఫ్రాంచైజీలు వెనుకాడయని తెలిపాడు.
ఇక జస్ప్రీత్ బుమ్రాను ముంబై ఇండియన్స్ రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలో టీమిండియాకు కీలక బౌలర్గా మారిన బుమ్రా.. తాజాగా సారథిగా కూడా సత్తా చాటాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో బుమ్రా.. భారత జట్టును నడిపించాడు. అసాధారణమైన బౌలింగ్.. అద్భుత కెప్టెన్సీతో భారత జట్టుకు 295 పరుగుల భారీ విజయాన్నందించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఆసీస్ గడ్డపై టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం. ఈ క్రమంలోనే బుమ్రాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
తాజాగా అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన ఆశిష్ నెహ్రా.. బుమ్రా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఓ బౌలర్గా బుమ్రా తన సత్తా ఏంటో లెక్కలేనన్ని సార్లు నిరూపించుకున్నాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో.. ఆసీస్ పర్యటన తొలి మ్యాచ్లో టీమిండియా సారథిగా బాధ్యతలు తీసుకున్న బుమ్రా ఎలాంటి ఒత్తిడి లేకుండా అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
అటు కెప్టెన్గా.. ఇటు బౌలర్గా ఒత్తిడిని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్కు గురైన తర్వాత టీమిండియాను బుమ్రా అద్భుతంగా నడిపించాడు. బుమ్రాను ఎవరూ ఓడించలేరు. బుమ్రా గనుక ఐపీఎల్ వేలంలోకి వస్తే ఐపీఎల్ జట్లకు రూ. 520 కోట్ల పర్స్ మనీ కూడా సరిపోయేది కాదు. ఆల్టైమ్ రికార్డ్స్ అన్నీ బద్దలయ్యేవి. 'అని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.