కుటుంబాన్ని వదిలి ఉండలేకనే టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోలేదని మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అన్నాడు. తన పిల్లలు చాలా చిన్నవారని, వారిని వదిలి టీమిండియాతో సుదీర్ఘ కాలం పనిచేయలేనని చెప్పాడు. గౌతమ్ గంభీర్కు కూడా చిన్న పిల్లలు ఉన్నారని, కానీ అతని ఆలోచనలు భిన్నంగా ఉంటాయని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ 2024తో హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియగా.. గౌతమ్ గంభీర్ను కొత్త కోచ్గా బీసీసీఐ నియమించింది. వాస్తవానికి ద్రవిడ్ వారసుడిగా ఆశిష్ నెహ్రా.. టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపడుతాడని జోరుగా ప్రచారం జరిగింది. ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్గా ఆ జట్టును ఛాంపియన్గా నిలబెట్డటంతో పాటు ఐపీఎల్ 2023లో రన్నరప్గా నిలపడంతో ఆశిష్ నెహ్రా పేరు తెరపైకి వచ్చింది.

టీ20 ప్రపంచకప్ 2024 ముందే నెహ్రాకు హెడ్ కోచ్ బాధ్యతలు ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమైంది. గంభీర్ నియామకం ముందు కూడా బీసీసీఐ.. నెహ్రాను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హెడ్ కోచ్ బాధ్యతలను చేపట్టేందుకు తాను సిద్దంగా లేనని నెహ్రా తెలిపాడు. ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
నాకు ఆసక్తి లేదు..
'టీమిండియా హెడ్ కోచ్ పదవి గురించి నేను ఏ రోజు ఆలోచించలేదు. నా పిల్లలు చాలా చిన్నవారు. గౌతమ్ గంభీర్ పిల్లలు కూడా చిన్నవారే. కానీ అతని ఆలోచనలు భిన్నం. ప్రతీ ఒక్కరికి భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. అందుకే నా ప్రస్తుత బాధ్యతలతోనే నేను సంతోషంగా ఉన్నాను. కుటుంబానికి దూరంగా 9 నెలల పాటు జట్టుతో ప్రయాణం చేసే మూడ్ నాకు లేదు.
కెప్టెన్సీ మార్పు సహజమే..
హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించడం ఆశ్చర్యం కలిగించలేదు. క్రికెట్లో ఇలాంటివి సహజమే. కోత్ కోచ్ వచ్చినప్పుడు వారి ప్రణాళికలు, ఆలోచనలకు తగ్గట్లు జట్టులో మార్పులు చేస్తుంటారు.అయితే ఈ విషయాన్ని గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హార్దిక్ పాండ్యాకు వివరించారని భావిస్తున్నా.
పరిమిత ఓవర్లలో క్రికెట్లో హార్దిక్ పాండ్యా చాలా కీలకమైన ఆటగాడు. అతను జట్టులో ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్ అందుబాటులో ఉన్నట్లే. జట్టుకు మంచి సమతూకం వస్తుంది.'అని ఆశీష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.
గొడవలుండవ్..
గంభీర్, కోహ్లీ మధ్య ఉన్న పాతగొడవలు టీమిండియాకు సమస్యగా మారవని ఆశిష నెహ్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పాడు. గంభీర్, కోహ్లీ ఇద్దరూ ఆట పట్ల అంకిత భావంతో ఉంటారని, డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నప్పుడు జట్టు కోసం ఒక్కటవుతారని నెహ్రా స్పష్టం చేశాడు.
కోహ్లీ, గంభీర్ ఇద్దరూ ఉద్వేగభరితమైన వ్యక్తులని.. ఇద్దరూ జట్టు కోసం ఆడినప్పుడల్లా ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టేవారని గుర్తు చేసుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్లో కలిసి ఉన్నప్పుడు జట్టు కోసం ఐక్యంగా ఉంటారని తెలిపాడు గంభీర్ ఎప్పుడూ ముక్తసరిగా ఉంటాడని, తన మనసులోని మాటను మాత్రమే వింటాడని నెహ్రా చెప్పుకొచ్చాడు.