
న్యూఢిల్లీ: అనూహ్యంగా భారత జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న రిషభ్ పంత్పై మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్కు సీనియర్ క్రికెటర్లు దూరంగా ఉండగా.. సెలెక్షన్ కమిటీ జట్టు సారథ్య బాధ్యతలను కేఎల్ రాహుల్కు అప్పగించింది. ఇక అతను చివరి నిమిషంలో గాయంతో దూరమవడంతో వైస్ కెప్టెన్ అయిన రిషభ్ పంత్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అయితే కెప్టెన్గా తన తొలి టీ20 మ్యాచ్లోనే పంత్ తడబడ్డాడు. ఐపీఎల్ 2022 సీజన్లో పర్పుల్ క్యాప్ హోల్డర్గా నిలిచిన యుజ్వేంద్ర చాహల్ సేవలను పూర్తిగా వాడుకోలేకపోయాడు.
ఢిల్లీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో పంత్.. యూజీకి పూర్తి ఓవర్లు బౌలింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఇచ్చిన 2 ఓవర్లను కూడా రాంగ్ టైమ్లో ఇచ్చాడని విమర్శిస్తున్నారు. పవర్ ప్లేలో నాలుగో ఓవర్లోనే యజ్వేంద్ర చాహాల్ను బౌలింగ్కు దింపిన రిషభ్ పంత్.. మూల్యం చెల్లించుకున్నాడు. ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ ఉపయోగించుకొని క్వింటన్ డి కాక్, డ్వేన్ ప్రిటోరియస్ కలిసి 6, 4, 4 బాది... 16 పరుగులు పిండుకున్నారు.
తిరిగి 8వ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన యుజ్వేంద్ర చాహాల్ మొదటి మూడు బంతుల్లో పరుగులేమీ ఇవ్వకుండా డస్సెన్ను నిలువరించినా ఆ తర్వాత ఫోర్ బాదిన సఫారీ బ్యాటర్... 6 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత 20వ ఓవర్ వరకూ యజ్వేంద్ర చాహాల్కు పంత్ బౌలింగ్ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా.. పంత్ తీరును తప్పబట్టాడు. 'యజ్వేంద్ర చాహాల్ లాంటి స్పిన్నర్కి కేవలం 2.1 ఓవర్లు మాత్రమే ఇవ్వడం కరెక్ట్ కాదు. అక్షర్ పటేల్తో పూర్తి కోటా వేయించినప్పుడు, చాహాల్తోనూ వేయిస్తే పోయేదిగా... అక్కడే రిషబ్ పంత్ తప్పు చేశాడు...'అని నెహ్రా అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2022 సీజన్లో 27 వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహాల్ హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన చాహాల్ను ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ బాగా వాడుకున్నాడు. యుజువేంద్ర చాహాల్ని ఎలా, ఏ సమయాల్లో వాడాలనే విషయంపై క్లారిటీ లేకపోతే, తన ఫ్రెండ్ సంజూ శాంసన్ని అడిగి తెలుసుకోవాలని రిషబ్ పంత్కు అభిమానులు సలహా ఇస్తున్నారు.