
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు బౌలర్లు పనికిరారా? అని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ప్రశ్నించాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించిన నేపథ్యంతో తదుపరి సారథి ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చాలా మంది దిగ్గజాలు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ పేర్లు సూచిస్తున్నారు. మరికొంత మంది మాత్రం టీమిండియా భవిష్యత్తు దృష్ట్యా రిషభ్ పంత్కు అవకాశమిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు బౌలర్లను కెప్టెన్గా ఎంచుకోవద్దని బీసీసీఐ రాజ్యంగంలో ఏం రాసిలేదు కదా? అని ప్రశ్నించాడు.
టీమిండియా యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాకు సారథ్యం వహించే సామర్థ్యం ఉందని ఈ మాజీ పేసర్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ రేసులో నిలిచిన కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ కన్నా బుమ్రాను కెప్టెన్ చేయడం ఉత్తమమన్నాడు. అతను మూడు ఫార్మాట్లు ఆడుతున్న ప్లేయరని, రాహుల్, రిషభ్ పంత్ పరిమిత ఓవర్ల సిరీస్ల్లోనే ఆడుతున్నారని గుర్తు చేశాడు. ఇటీవల వాళ్లు కొన్ని మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితమయ్యారని తెలిపాడు. మూడు ఫార్మాట్లలో రెగ్యూలర్గా ఆడే బుమ్రాకు సారథ్య బాధ్యతలు ఇస్తే బాగుంటుందన్నాడు.
'రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రిషభ్ పంత్ టీమిండియా ఈ ప్రపంచం మొత్తం పర్యటించాడు. కానీ కొన్ని మ్యాచ్ల్లో అతను బెంచ్కే పరిమితమై డ్రింక్స్ మోసాడు. కేఎల్ రాహుల్ కూడా మయాంక్ అగర్వాల్ గాయపడటంతోనే టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. కాబట్టి ఈ ఇద్దరి కన్నా మూడు ఫార్మాట్లు రెగ్యూలర్గా ఆడే జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ చేయడం మంచి ఆప్షన్. బుమ్రా ఆటను బాగా అర్థం చేసుకోగలడు. పేసర్లు కెప్టెన్ అవకూడదు అని బీసీసీఐ నిబంధనల బుక్లో ఎక్కడా లేదు.'అని నెహ్రా చెప్పుకొచ్చాడు.
మరో వారం తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరనేదానిపై స్పష్టత ఇవ్వనుంది. త్వరలోనే న్యూజిలాండ్తో 3 టీ20లు, రెండు టెస్టు మ్యాచ్లు ఆడనుంది భారత జట్టు. ఈ సిరీస్ బరిలోకి దిగే జట్ల వివరాలను కూడా వెల్లడించనున్నారు.