ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడం తీవ్ర చర్చనీయాంశమైంది. పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం నడిచిన ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. తొలి రోజు 20 వికెట్లు .. రెండో రోజు 16 వికెట్లు పడ్డాయి. రెండు రోజుల వ్యవధిలోనే 36 వికెట్లు పడటంతో ఈ పిచ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా భారత్ అనగానే ఒంటికాలి మీద లేచేవాళ్లు చాలా మందే ఉన్నారు. భారత పిచ్ల వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుందని గతంలో చాలా మంది విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా టర్నింగ్ ట్రాక్లు తయారు చేసి మూడు రోజుల్లో ముగిసిన మ్యాచ్లపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కానీ మెల్బోర్న్ మ్యాచ్ మీద ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మౌనం పాటించడంపై భారత నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవట్లేదే? అని ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ మెల్బోర్న్ పిచ్పై ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీస్తున్నారు. పేస్కు అనుకూలించే పిచ్లపై రెండు రోజుల్లో మ్యాచ్లు ముగిసినా ఏం కాదా? అని సెటైర్లు పేల్చుతున్నారు. యాషెస్ సిరీస్లో తొలి టెస్ట్ కూడా రెండు రోజుల్లోనే ముగియగా.. అప్పుడు కూడా ఎవరూ మాట్లాడలేదు. భారత పిచ్లను టెస్ట్ క్రికెట్కు ప్రమాదకరమని అభివర్ణించిన నోర్లు ఇప్పుడు ఎందుకు మూగబోయాయని ప్రశ్నిస్తున్నారు.

నెలరోజుల క్రితం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసింది. స్పిన్కు అనుకూలంగా ఉన్న వికెట్పై బ్యాటర్లు తేలిపోయారు. దాంతో ఇంగ్లండ్, ఆసీస్ మాజీ ఆటగాళ్లు ఈ పిచ్పై విమర్శలు గుప్పించారు.
తొలి రోజు నుంచే బంతి టర్న్ అవ్వడం ఏంటని మండిపడ్డారు. టెస్ట్ క్రికెట్ మనుగడకే ప్రమాదమనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ మెల్ బోర్న్ మ్యాచ్లో రెండు రోజుల్లోనే 36 వికెట్లు పడ్డా ఎవరూ మాట్లాడటం లేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
భారత్లో ఒక రోజులో 15 వికెట్లు పడితే విమర్శలు గుప్పించిన వ్యక్తులు.. ఇప్పుడు మెల్ బోర్న్ పిచ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. తొలి రోజు నుంచే పిచ్ స్పిన్కు అనుకూలించ వద్దని సలహాలు ఇచ్చే మేదావులు.. ఆస్ట్రేలియాలో బంతి ఎక్కువగా స్వింగ్, బౌన్స్ అయినా ఆమోదయోగ్యమేనని భావిస్తారా? అని నిలదీసాడు. ఆస్ట్రేలియా పిచ్ గురించి మాట్లాడని వ్యక్తులకు భారత పిచ్లపై మాట్లాడే హక్కు కూడా లేదని, ద్వంద వైఖరి సరికాదని మండిపడ్డాడు.
మెల్బోర్న్లో పేస్కు అనుకూలించే గడ్డిని ఎందుకు ఉంచారని ప్రశ్నించాడు. ఇప్పటికే యాషెస్ సిరీస్ కూడా గెలిచారని, సమతూకమైన పిచ్ను సిద్దం చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి పిచ్లతో టెస్ట్ క్రికెట్పై ఆసక్తి తగ్గిపోతుందని చెప్పాడు.