బర్మింగ్హామ్: యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో ఇంగ్లండ్ పేలవ ఫీల్డింగ్పై ఆ జట్టు మాజీ కెప్టెన్ నాజర్ హుస్సెన్ విమర్శలు గుప్పించాడు. కీలకమైన చివరి సెషన్లో ఇంగ్లండ్ ఫీల్డర్లు బద్దకంగా ఉండటం ప్రత్యర్థికి కలిసొచ్చిందన్నాడు.
సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజా ఇచ్చిన సునాయస క్యాచ్ను నేలపాలు చేయడంతో పాటు అలెక్స్ క్యారీ స్టంపౌట్ అవకాశాన్ని వృథా చేశారని మండిపడ్డాడు. ఈ రెండింటికి తోడు స్టువర్ట్ బ్రాడ్ నోబాల్ తప్పిదం ఇంగ్లండ్కు తీరని నష్టం చేయనుందన్నాడు.

'ఎడ్జ్బాస్టన్ పిచ్ స్పిన్కు అద్భుతంగా అనుకూలిస్తోంది. ఇంగ్లీష్ స్పిన్నర్ మొయిన్ అలీ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ చివరి సెషన్లో ఇంగ్లండ్ ఫీల్డర్లు బద్దకంగా వ్యవహరించారు. ఓ సునాయస క్యాచ్తో పాటు స్టంపౌట్ అవకాశాన్ని చేజార్చారు. స్టువర్ట్ బ్రాడ్ నోబాల్ వికెట్ ఇంగ్లండ్కు తీరని నష్టం చేయనుంది.'అని నాజర్ హుస్సేన్ మండిపడ్డాడు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 81 ఓవర్లో సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. ఈ ఓవర్ రెండో బంతిని బ్రాడ్ అద్భుత ఇన్ స్వింగర్గా వేయగా.. ఖవాజా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ నోబాల్ అని అంపైర్ ప్రకటించడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు. అప్పటికీ ఆసీస్ స్కోర్ 264/5 కాగా.. ఉస్మాన్ ఖవాజా 112 పరుగులు మాత్రమే చేశాడు. ఒకవేళ ఈ వికెట్ గనుక పడి ఉంటే ఆసీస్ 300లోపే ఆలౌటయ్యేది.
ఇక ఉస్మాన్ ఖవాజా (279 బంతుల్లో 14 ఫోర్లతో 2 సిక్స్లతో 126 బ్యాటింగ్) సెంచరీతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 311/5తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఖవాజాకు తోడుగా అలెక్స్ క్యారీ ( 80 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ (63 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు.
చేతిలో 5 వికెట్లు ఉన్న ఆ జట్టు ఇంకా 82 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 393/8 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.