బర్మింగ్హామ్: సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఇంగ్లండ్ వెటరన్ స్పిన్నర్ మొయిన్ అలీకి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఊహించని షాకిచ్చింది. యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో హద్దులు ధాటిన మొయిన్ అలీపై ఐసీసీ కొరడా ఝులిపించింది.
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20ను ఉల్లంఘించిన మొయిన్ అలీకి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించింది. ఈ విషయాన్ని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఒకే సీజన్లో మూడు కంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్స్ వస్తే ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధిస్తారు.

అయితే ఈ మ్యాచ్లో మొయిన్ అలీ చేసిన తప్పిదం ఏంటంటే.. అంపైర్ల అనుమతి లేకుండా చేతికి స్ప్రే చేసుకోవడమే. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా 89వ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మొయిన్ అలీ.. డ్రెయింగ్ ఏజేంట్తో తన చేతిపై స్ప్రే చేయించుకున్నాడు.
నిబంధనల ప్రకారం మ్యాచ్ ఆడే ఆటగాళ్లు అంపైర్ల అనుమతి లేకుండా చేతికి ఎటువంటి క్రీమ్లు గానీ స్ప్రేలు గాని చేసుకోకూడదు. కానీ అంపైర్కు చెప్పకుండా అలీ స్ప్రే చేసుకోవడంతో మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు.
311/5 ఓవర్నైట్ స్కోర్ మూడో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 386 పరుగులకు కుప్పకూలింది. 75 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా(321 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 141), అలెక్స్ క్యారీ(99 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 66)లను జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్ ఔట్ చేశారు.
ప్యాట్ కమిన్స్(62 బంతుల్లో 3 సిక్స్లతో 38) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఓలీ రాబిన్సన్ పెవిలియన్ చేర్చాడు. ఇంగ్లండ్కు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్ మూడేసి వికెట్లు తీయగా.. మొయిన్ అలీ రెండు వికెట్లు పడగొట్టాడు.
అండర్సన్, బెన్ స్టోక్స్కు ఒక్కో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 393/8 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.