లార్డ్స్: యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్ట్లో ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో ఔటైన తీరుపై వివాదం చోటు చేసుకుంది. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ఆస్ట్రేలియా వ్యవహరించిందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వివాదాస్పద స్టంపౌట్పై లార్డ్స్ లాంగ్ రూమ్లోనూ గొడవ చోటు చేసుకుంది. ముగ్గురు మేరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) సభ్యులు ఆస్ట్రేలియా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఛీటర్స్ అంటూ ఎగతాళి చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

లంచ్ సమయంలో ఆసీస్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లోకి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్లను ఛీటర్స్ అంటూ ముగ్గురు ఎంసీసీ సభ్యులు దూషించారు.
ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఎంసీసీ వారిని సస్పెండ్ చేసింది. భవిష్యత్తులో లార్డ్స్ మైదానంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది.
'తమ సభ్యుల నుంచి ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నాం. వాళ్లు మళ్లీ లార్డ్స్లో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తున్నాం. ఈ ఘటనపై పూర్తి విచారణ ఆదేశించాం. దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరికాదు.'అని ఎంసీసీ ఛీఫ్ ఎగ్జిక్యూటీవ్ గై లావెండర్ తెలిపాడు.
అసలేం జరిగిందంటే...?:చివరి రోజు తొలి సెషన్ ఆటలో ఇంగ్లండ్ 193/5గా ఉన్న సమయంలో.. కామెరూన్ గ్రీన్ బౌన్సర్ను తప్పించుకునేందుకు బెయిర్ స్టో కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లోకి వెళ్లగా.. నాన్ స్ట్రైకర్ బెన్ స్టోక్స్ను కలిసేందుకు జానీ బెయిర్ స్టో క్రీజును వీడాడు. వెంటనే కీపర్ బంతిని వికెట్లకు కొట్టి గట్టిగా అప్పీల్ చేశాడు.
బెయిర్స్టో, స్టోక్స్తో పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు, స్టాండ్స్లోని అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బెయిర్స్టో పరుగు తీసేందుకు ప్రయత్నించలేదు కాబట్టి థర్డ్ అంపైర్ ఎరాస్మస్ నాటౌట్ అంటాడేమోనని అనుకున్నారు. కానీ బంతి డెడ్ కాలేదని భావించి బెయిర్స్టోను స్టంపౌట్గా ప్రకటించాడు. దీంతో ఆస్ట్రేలియా సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లండ్ ఆటగాళ్లు షాక్లో మునిగిపోయారు.
ఇది అనైతికమని ఆసీస్ కెప్టెన్ కమిన్స్తో బెయిర్స్టో, మరో ఎండ్లో ఉన్న కెప్టెన్ స్టోక్స్ మాట్లాడినా ఫలితం లేకపోయింది. బెయిర్ స్టో క్రీజులో ఉంటే తమకు విజయం దక్కదని భావించిన ఆసీస్ తమ అప్పీల్ను వెనక్కి తీసుకోలేదు.