న్యూఢిల్లీ: ఇంగ్లండ్ బజ్బాల్ కాన్సెప్ట్కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిదా అయ్యాడు. ఐదు టెస్ట్ల యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం మొదలైన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ను తీరును మహేష్ బాబు కొనియాడాడు. బజ్బాల్తో టెస్ట్ క్రికెట్లో కొత్త శకం మొదలైందని, ఇంగ్లండ్ బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.
'393-8 డిక్లేర్డ్. నేను చదవుతున్నది నిజమేనా..? అద్భుతం.. అసాధారణం. బజ్బాల్తో క్రికెట్లో కొత్త శకం మొదలైంది.'అని ఫైర్ ఏమోజీలతో మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. అయితే మహేశ్ బాబు ట్విటర్ అకౌంట్కు బ్లూటిక్ లేకపోవడంతో అభిమానులు కాస్త కన్ఫ్యూజన్ అయ్యారు. రియల్ అకౌంటా? ఫేక్ అకౌంటా? అని అయోమయానికి గురయ్యారు. కానీ ఫోలవర్ల సంఖ్య 13.3 మిలియన్లు ఉండటంతో మహేశ్ బాబు అకౌంటేనని నిర్దారించుకున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేశ్ బాబు ట్విటర్ అకౌంట్కు బ్లూ టిక్ లేకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బ్లూటిక్ ఇవ్వాలని ట్విటర్ ఇండియాను డిమాండ్ చేస్తున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. జోరూట్(152 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 118 నాటౌట్) శతక్కొట్టడంతో తొలి ఇన్నింగ్స్ను 393/8 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసేసమయానికి 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(8 బ్యాటింగ్), ఉస్మాన్ ఖవాజా(4) క్రీజులో ఉన్నారు.
ఓ దశలో వరుసగా వికెట్లు కోల్పోయినా.. ఇంగ్లండ్ తమ బజ్బాల్ కాన్సెప్ట్తోనే బ్యాటింగ్ చేసింది. ఓలీపోప్(31), హ్యారీ బ్రూక్(32), బెన్ స్టోక్స్(1) నిరాశపర్చినా.. 176 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడినా బ్యాటింగ్లో దూకుడు మాత్రం తగ్గించలేదు. ఓవర్కు 5 పరుగులు చొప్పున రాబట్టింది.
కఠిన పరిస్థితుల్లోనూ జోరూట్, జానీ బెయిర్స్టో (78 బంతుల్లో 12 ఫోర్లతో 78) ధనాధన్ ఆటతో జట్టును ఆదుకున్నారు. ఆరో వికెట్కు 121 పరుగులు జోడించిన అనంతరం బెయిర్ స్టో ఔటైనా.. స్పిన్నర్ నాథన్ లయన్(4/149) ఒకవైపు దెబ్బ తీస్తున్నా.. జోరూట్ మాత్రం తగ్గలేదు.
మరోవైపు మహేశ్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా అనంతరం దర్శకధీరుడు రాజమౌళితో మహేశ్ బాబు పాన్ ఇండియా సినిమా చేయనున్నారు.