లార్డ్స్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను ఓటమితో ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. బజ్బాల్ కాన్సెప్ట్తో తొలి టెస్ట్లో చేతులు కాల్చుకున్న బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్.. లార్డ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమై రెండో టెస్ట్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.
హోరాహోరీగా సాగిన తొలి మ్యాచ్లో తృటిలో విజయం చేజారినా.. ఏ మాత్రం వెనకడగువేయని ఇంగ్లండ్ బజ్బాల్ విషయంలో తగ్గేదేలే అంటోంది. జట్టు కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్తో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం మరింత ధాటిగా ఆడుతామని స్పష్టం చేశారు. మరోవైపు ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ ఇన్నింగ్స్తో పాటు సంప్రదాయక టెస్ట్ ఫార్మాట్ ఆటతో అద్భుత విజయాన్నందుకున్న ఆసీస్ ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది.

తొలి టెస్ట్ మాదిరి ప్రత్యర్థి దూకుడును క్యాష్ చేసుకుంటూ జైత్రయాత్రను కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. దాంతో రెండో టెస్ట్ కూడా క్రికెట్ అభిమానులకు కావాల్సిన మజాను అందించనుంది. ఇక రెండో టెస్ట్ బరిలోకి దిగే తమ తుది జట్టును ఇంగ్లండ్ ఒక రోజు ముందుగానే ప్రకటించింది. ఫైనల్ ఎలెవన్లో ఒకే ఒక మార్పు చేసిన ఇంగ్లండ్.. వెటరన్ స్పిన్నర్ మొయిన్ అలీని తప్పించి యువ పేసర్ జోష్ టంగ్ను తీసుకుంది.
సుదీర్ఘ కాలం తర్వాత బెన్ స్టోక్స్ రిక్వెస్ట్తో టెస్ట్ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చిన మొయిన్ అలీ రెండో మ్యాచ్కే దూరం కావాల్సి వచ్చింది. తొలి టెస్ట్ సందర్భంగా అతని బౌలింగ్ ఫింగర్కు గాయం కావడంతో ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. లార్డ్స్ మైదానం కూడా పేస్కు అనుకూలించనున్న నేపథ్యంలో ఎక్స్ట్రా పేసర్తోనే బరిలోకి దిగాలని భావించింది.

స్పిన్ ఆప్షన్గా జోరూట్ను వాడుకోవాలని నిర్ణయించుకుంది. జట్టులోకి వచ్చిన జోష్ టంగ్.. గత నెలలో ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్ట్లో ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఈ ఒక్క మార్పు మినహా మిగతా ఆటగాళ్లంతా కొనసాగారు. ఈ మార్పు కూడా తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
యాషెస్ రెండో టెస్ట్ ఆడే ఇంగ్లండ్ తుది జట్టు:
బెన్ డక్కెట్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జోరూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్స్టో, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్, జేమ్స్ అండర్సన్