లార్డ్స్: యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా తన జోరును కొనసాగిస్తోంది. వరుసగా రెండో టెస్ట్లోనూ గెలుపొంది 5 మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. లార్ట్స్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్ట్లో ఆసీస్ 43 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. ఈ మ్యాచ్లో విజయం కోసం ఆసీస్ అడ్డదారులు తొక్కిందని, క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించిందని మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడుతున్నారు.
విజయం కోసం ఆసీస్ ఎంతటికైనా తెగిస్తుందని, అన్యాయంగా గెలిచేందుకు కూడా వెనుకాడదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జానీ బెయిర్స్టోను అన్యాయంగా ఔట్ చేశారని, అతన్ని స్టంపౌట్ చేసిన విధానం అనైతికమని విమర్శలు గుప్పిస్తున్నారు.

అసలేం జరిగిందంటే...?:చివరి రోజు తొలి సెషన్ ఆటలో ఇంగ్లండ్ 193/5గా ఉన్న సమయంలో.. కామెరూన్ గ్రీన్ బౌన్సర్ను తప్పించుకునేందుకు బెయిర్ స్టో కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లోకి వెళ్లగా.. నాన్ స్ట్రైకర్ బెన్ స్టోక్స్ను కలిసేందుకు జానీ బెయిర్ స్టో క్రీజును వీడాడు. వెంటనే కీపర్ బంతిని వికెట్లకు కొట్టి గట్టిగా అప్పీల్ చేశాడు.
బెయిర్స్టో, స్టోక్స్తో పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు, స్టాండ్స్లోని అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బెయిర్స్టో పరుగు తీసేందుకు ప్రయత్నించలేదు కాబట్టి థర్డ్ అంపైర్ ఎరాస్మస్ నాటౌట్ అంటాడేమోనని అనుకున్నారు. కానీ బంతి డెడ్ కాలేదని భావించి బెయిర్స్టోను స్టంపౌట్గా ప్రకటించాడు. దీంతో ఆస్ట్రేలియా సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లండ్ ఆటగాళ్లు షాక్లో మునిగిపోయారు.
ఇది అనైతికమని ఆసీస్ కెప్టెన్ కమిన్స్తో బెయిర్స్టో, మరో ఎండ్లో ఉన్న కెప్టెన్ స్టోక్స్ మాట్లాడినా ఫలితం లేకపోయింది. బెయిర్ స్టో క్రీజులో ఉంటే తమకు విజయం దక్కదని భావించిన ఆసీస్ తమ అప్పీల్ను వెనక్కి తీసుకోలేదు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ ఆస్ట్రేలియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇక స్టాండ్స్లోని ఇంగ్లండ్ అభిమానులైతే.. ఆసీస్ను హేళన చేస్తూ చాలాసేపు అరిచారు. అదే ఆస్ట్రేలియా.. అదే ఛీటింగ్ అంటూ మండిపడ్డారు. ఈ వికెట్ పడ్డాక కసిగా ఆడిన స్టోక్స్ సిక్సర్లతో చెలరేగాడు. మాజీ క్రికెటర్లు మైఖేల్ వాన్, గౌతమ్ గంభీర్లు కూడా ఆసీస్ తీరును తప్పుబట్టారు. రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాళ్లు మాత్రం బెయిర్ స్టోనే తప్పుబడుతున్నారు.