లండన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఇంగ్లండ్కు మరో గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు వైస్ కెప్టెన్ ఓలీ పోప్ గాయం కారణంగా యాషెస్ సిరీస్లోని మిగతా మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో ఓలీ పోప్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా అతని కుడి భుజానికి గాయమైంది.
గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్కాన్ చేయగా.. సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. 'యాషెస్ సిరీస్లోని మిగతా మూడు మ్యాచ్లకు ఓలీ పోప్ దూరమయ్యాడు. అతని కుడి భుజం డిస్ లొకెట్ అయ్యింది. వైద్యుల సూచన మేరకు భుజానికి ఓలీ పోప్ త్వరలో శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు.'అని పేర్కొంది.

ఇప్పటివరకైతే ఇంగ్లండ్ ఓలీ పోప్ స్థానంలో మరో ఆటగాడిని తీసుకోలేదు. అయితే, తొలి రెండు టెస్టుల్లో ఓలీ పోప్ భారీ స్కోర్లు సాధించలేకపోయాడు. తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో 31, రెండో ఇన్నింగ్స్లో 14 పరుగులు చేశాడు. రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో 42 రన్స్ చేసిన అతడు.. సెకండ్ ఇన్నింగ్స్లో 3 పరుగులకే ఔటయ్యాడు.
ఆస్ట్రేలియాతో సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో వికెట్ తేడాతో ఓడిన ఇంగ్లండ్.. లార్డ్స్ టెస్ట్లో 43 పరుగులతో పరాజయం పాలైంది. దాంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. లార్డ్స్ టెస్ట్లో జానీ బెయిర్ స్టో ఔటైన తీరు వివాదాస్పదమైంది. ఇరు జట్ల మధ్య మాటల యుద్దానికి తెరలేచింది. ఈ ఘటనతో చివరి మూడు టెస్ట్ల్లో ఇంగ్లండ్ మరింత కసిగా ఆడనుంది.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జులై 6 నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఈ టెస్టు ఇంగ్లాండ్కు కీలకంకానుంది. ఇందులో ఓడితే సిరీస్ను ఆసీస్ 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంటుంది. మూడో టెస్ట్లో ఇరు జట్లలో మార్పులు జరగనున్నాయి.
పిక్క కండరాల గాయంతో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ సిరీస్ మొత్తానికి దూరం కాగా.. అతని స్థానంలో టాడ్ మర్ఫీ ఆడనున్నాడు. ఇంగ్లండ్లో జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్లో ఒకరికి రెస్ట్ ఇవ్వనున్నారు.