మాంచెస్టర్: యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్ట్ ఫలితం తేలకుండా ముగిసింది. విజయం దిశగా సాగిన ఇంగ్లండ్ ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. నాలుగో రోజు 60 ఓవర్ల ఆటను మింగేసిన వరణుడు.. చివరి రోజు ఒక్క బంతిని కూడా పడనివ్వలేదు. ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో అంపైర్లు ఐదు రోజు ఆటను రద్దు చేసి మ్యాచ్ డ్రా అయినట్లు ప్రకటించారు.
దాంతో ఈ మ్యాచ్లో సునాయసంగా గెలవాల్సిన ఇంగ్లండ్ డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ అనూహ్య ఫలితం కారణంగా ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ కోల్పోయింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆసీస్ 2-1 తేడాతో యాషెస్ సిరీస్ను రిటైన్ చేసుకుంది. ఐదు టెస్ట్ల సిరీస్లో ఆసీస్ ఇప్పటికే 2-1తో లీడ్లో ఉండటంతో చివరి టెస్ట్లో ఇంగ్లండ్ గెలిచినా లాభం లేకపోయింది.

ఒకవేళ చివరి టెస్ట్ గెలిచి 2-2తో సిరీస్ సమం చేసినా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో యాషెస్ సిరీస్ విజేతగా ఆసీసే నిలవనుంది. నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ విజయం సాధించి ఉంటే.. సిరీస్పై బెన్ స్టోక్స్ సేనకు ఆశలు ఉండేవి. ఈ సిరీస్లో ఇంగ్లండ్ ఓడినా.. అద్వితీయమైన ఆట తీరుతో అభిమానుల మనసులను గెలుచుకుంది.
వాస్తవానికి తొలి రెండు టెస్ట్ల్లో కూడా ఆ జట్టే గెలవాల్సింది. కానీ పరిస్థితులు కలిసి రాక.. గెలుపు అంచున బోల్తా పడింది. నాలుగో టెస్ట్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 317 పరుగులకు కుప్పకూలింది. మిచెల్ మార్ష్(51), మార్నస్ లబుషేన్(51) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. క్రిస్ వోక్స్(5/62) ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. స్టువర్డ్ బ్రాడ్ రెండు, జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ తీసారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. బజ్బాల్ బ్యాటింగ్తో 592 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాక్ క్రాలీ(189) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా.. జానీ బెయిర్ స్టో(99 నాటౌట్) సెంచరీ మిస్ చేసుకున్నాడు. జోరూట్(84), హ్యారీ బ్రూక్(61), బెన్ స్టోక్స్(51), మొయిన్ అలీ(54) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఆసీస్ బౌలర్లలో హజెల్ వుడ్(5/126) ఐదు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ప్యాట్ కమిన్స్కు ఓ వికెట్ దక్కింది. రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 214/5తో నిలిచింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(18), డేవిడ్ వార్నర్(28)లతో పాటు స్టీవ్ స్మిత్(17), ట్రావిస్ హెడ్(1) విఫలమవ్వగా.. మార్నస్ లబుషేన్(111) సెంచరీతో ఆదుకున్నాడు.
వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆసీస్ 5 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఇంకా 61 పరుగుల వెనుకంజలో ఉంది. వర్షం అంతరాయం కలిగించకుండా ఆట సజావుగా జరిగి ఉంటే ఇంగ్లండ్ సునాయసంగా గెలుపొందేది.