న్యూఢిల్లీ: ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో స్టంపౌట్ వివాదం.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చిచ్చురేపింది. ఇప్పటికే ఇరు దేశాల మాజీ క్రికెటర్లు, అభిమానులు రెండుగా విడిపోయి.. సోషల్ మీడియా వేదికగా తిట్టుకుంటుండగా.. ఇరు దేశాల మీడియా సైతం దుమ్మెత్తిపోసుకుంటోంది. చివరకు ఇరు దేశాల ప్రధానులు ఈ ఘటనపై స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది.
ముందుగా ఈ ఘటనపై స్పందించిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తమ ఆటగాళ్లను కొనియాడాడు. ముఖ్యంగా క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహించి సాధించే విజయం తమకు అక్కర్లేదని తెలిపిన బెన్ స్టోక్స్ వ్యాఖ్యలను రిషి సునాక్ మెచ్చుకున్నాడు.ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆసీస్ తరహాలో విజయం సాధించాలని అనుకోమని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ స్పందించారు. తమ జట్టుకు అండగా నిలుస్తూ ప్రశంసల జల్లు కురిపించాడు. 'అదే ఆసీస్ పూర్వ వైభవాన్ని గుర్తు చేస్తూ విజయాలు సాధిస్తూనే ఉంది. వాళ్లు విజేతలుగా తిరిగిరావాలని కోరుకుంటున్నా. విజేతలుగా తిరిగి వచ్చే మా ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికేందుకు సిద్దంగా ఉన్నాం. ఇప్పటికే ఆసీస్ మహిళల జట్టు అద్భుత విజయాన్నందుకుంది.'అని ఆంథనీ అల్బనీస్ పేర్కొన్నారు.
యాషెస్ సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో బెయిర్ స్టో స్టంపౌట్పై దుమారం రేగింది. చివరి రోజు తొలి సెషన్ ఆటలో ఇంగ్లండ్ 193/5గా ఉన్న సమయంలో.. కామెరూన్ గ్రీన్ బౌన్సర్ను తప్పించుకునేందుకు బెయిర్ స్టో కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లోకి వెళ్లగా.. నాన్ స్ట్రైకర్ బెన్ స్టోక్స్ను కలిసేందుకు జానీ బెయిర్ స్టో క్రీజును వీడాడు.
వెంటనే కీపర్ బంతిని వికెట్లకు కొట్టి గట్టిగా అప్పీల్ చేశాడు. బెయిర్స్టో పరుగు తీసేందుకు ప్రయత్నించలేదు కాబట్టి థర్డ్ అంపైర్ ఎరాస్మస్ నాటౌట్ అంటాడేమోనని అంతా అనుకున్నారు. కానీ బంతి డెడ్ కాలేదని భావించిన థర్డ్ అంపైర్ బెయిర్స్టోను స్టంపౌట్గా ప్రకటించాడు. అయితే ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమని అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆసీస్పై మండిపడ్డారు.