ఆరంభంలోనే ఆరేసిన ఆర్చర్:
గురువారం హెడింగ్లే మైదానంలో ప్రారంభమయిన మూడో టెస్టు వర్షం వల్ల దాదాపు ఒక సెషన్ సమయం వృథా అయింది. వర్షం కారణంగా బౌలర్లకు పూర్తి అనుకూలంగా మారిన పరిస్థితుల్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మార్కస్ హ్యారిస్ (8), ఉస్మాన్ ఖవాజా (8) సింగిల్ డిజిట్కే పెవిలియన్ బాటపట్టారు. దీంతో ఆసీస్ 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆదుకున్న వార్నర్, లబుషేన్:
ఈ దశలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (61; 94 బంతుల్లో 7×4) ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ అద్భుత బ్యాటింగ్ చేసాడు. గాయంతో మ్యాచ్కు దూరమైన స్టీవ్ స్మిత్ స్థానంలో ఆడుతున్న లబుషేన్ (74; 129 బంతుల్లో 10×4) కూడా వార్నర్కు అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి ఆచితూచి ఆడుతూ అర్ధ సెంచరీలతో ఆసీస్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. ఈ జోడీ మూడో వికెట్కు 111 పరుగులు జోడించడంతో ఆసీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే 136/2 వద్ద జోరుమీదున్న వార్నర్ను ఆర్చర్ పెవిలియన్ చేర్చి ఇంగ్లాండ్కు బ్రేక్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి కంగారూలు ఏ దశలోనూ కోలుకోలేదు.
వెస్టిండీస్తో తొలి టెస్ట్.. నలుగురు బౌలర్ల వ్యూహంతో భారత్?
ఆర్చర్ విజృంభణ:
ఓ ఎండ్లో లబుషేన్ పోరాడుతున్నా.. అతడికి సహకరించేవారు కరవయ్యారు. ఆర్చర్, బ్రాడ్ విజృంభించడంతో మిడిలార్డర్లో ట్రెవిస్ హెడ్ (0), మాథ్యూవేడ్ (0) డకౌటయ్యారు. కెప్టెన్ టిమ్ పైన్ (11) కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. ప్యాటిన్సన్ (2), కమిన్స్ (0) త్వరగానే పెవిలియన్ చేరారు. ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి ఆసీస్ 43 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లు కోల్పోయింది. ఆర్చర్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఆర్చర్తో పాటు బ్రాడ్ (2/32) కూడా సత్తా చాటాడు. వర్షం కారణంగా బుధవారం పూర్తిస్థాయి ఆట సాగలేదు. ఐదు టెస్టుల సిరీస్లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది.