టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై మాజీ క్రికెటర్ సయ్యద్ కిర్మాణీ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్లో రాజకీయాలు చేయడం ఏంటని మండిపడ్డారు. సూర్య, టీమిండియా వ్యవహరించిన తీరు సిగ్గు చేటని, ఓ క్రికెటర్గా తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఫైనల్తో సహా మూడు సార్లు పాకిస్థాన్ను భారత్ మట్టికరిపించింది.
అయితే ఈ టోర్నీ ట్రోఫీని భారత్ స్వీకరించలేదు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉండటంతో అతని చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించేందుకు నిరాకరించింది. దాంతో అతను ట్రోఫీ, విన్నింగ్ మెడల్స్ తీసుకొని వెళ్లిపోయారు. అంతకుముందు పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత ప్లేయర్లు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఏసీసీ, ఐసీసీ రూల్స్ ప్రకారమే పాకిస్థాన్తో మ్యాచ్ ఆడుతున్నామని, ఆ జట్టుతో ఆడే ఉద్దేశం తమకు లేదనే విషయాన్ని టీమిండియా తెలియజేసింది.
అంతేకాకుండా పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు కెప్టెన్ సూర్య సంఘీభావం ప్రకటించడంతో పాటు తమ విజయాన్ని భారత సాయుధ బలగాలకు అంకితం చేశాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం రాజకీయ ప్రకటనలు, అంశాలను ప్రస్తావించడం చేయవద్దు. దాంతో సూర్యపై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది. అయినా వెనక్కి తగ్గని సూర్య.. ఈ టోర్నీలోని తన మ్యాచ్ ఫీజును భారత సైన్యానికి విరాళంగా ప్రకటించారు.
ఆసియా కప్ 2025 టోర్నీలో భారత వ్యవహరించిన తీరుపై తాజాగా కిర్మాణీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. భారత జట్టు తీరును తప్పుబట్టాడు. క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ అని, రాజకీయాలు చేయడం సరికాదని విమర్శించాడు.

'ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న తీరు ఏ మాత్రం నచ్చడం లేదు. నేను దేశాల పేర్లు చెప్పను కానీ, ఆటలో క్రీడాస్ఫూర్తి కనిపించడం లేదు. క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్. కానీ ఇప్పుడు ఆ ఆటను రాజకీయాలకు వేదికగా మార్చారు. మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన దారుణంగా ఉంది. అహంకారంతో కూడిన సంజ్ఞలు, ప్రత్యర్థుల పట్ల ద్వేషం, అమర్యాదగా ప్రవర్తించడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నేను కేవలం ఆసియా కప్ ఫైనల్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. నాకు చాలా మంది నుంచి సందేశాలు వస్తున్నాయి. 'భారత జట్టుకు ఏమైంది? మైదానంలో రాజకీయాలు ఏంటి?'అని ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో ఉన్న నా స్నేహితుల మాటలు వినడానికి నాకు సిగ్గుగా ఉంది.
సాధారణంగా క్రీడల్లో రాజకీయాలు చేయకూడదు. రాజకీయాలను పక్కన పెట్టాలి. క్రీడా మైదానానికి దూరంగా జరిగే విషయాలను అక్కడే వదిలేయాలి. ఈ గొప్ప క్రికెట్ గేమ్ నుంచి సంపాదిస్తున్న సొమ్మును ఆ రాజకీయాల కోసం ఖర్చు చేయవద్దు. వరద సాయం, లేదా ఇతర మంచి కార్యక్రమాల కోసం వెచ్చించవచ్చు. కానీ రాజకీయాలను ప్రేరపితం చేసేలా విరాళాలు ప్రకటించడం సరికాదు. ఈ వ్యవహారంపై మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. ఓ మాజీ క్రికెటర్గా నేను తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.'అని సయ్యద్ కిర్మాణీ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్య విరాళం ప్రకటించడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.