భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. అప్కమింగ్ ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ తెలిపారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఐపీఎల్ షెడ్యూల్పై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రభుత్వ అధికారులతో చర్చిస్తుందని చెప్పారు. ఎన్నికల తేదీలు, సెక్యూరిటీ విషయంపై భారత హోమ్ మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

'ఐపీఎల్ షెడ్యూల్ ఖరారుపై కసరత్తులు చేస్తున్నాం. భారత హోం మంత్రిత్వ శాఖ, భారత ఎన్నికల సంఘం నుంచి పోలింగ్ షెడ్యూల్పై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికల తేదీలు వచ్చిన వెంటనే షెడ్యూల్ను ఫైనలైజ్ చేస్తాం. ఇప్పటికే టోర్నీకి సంబంధించిన అనుమతులపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దృష్టి పెట్టింది. లీగ్ ప్రారంభానికి కావాల్సిన అనుమతులు లభించడంతో పాటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ఐపీఎల్ షెడ్యూల్ను ప్రకటిస్తాం.
ఐపీఎల్ షెడ్యూల్ను రెండు దశలుగా ప్రకటించాలనుకుంటున్నాం. ఐపీఎల్ 2019 మాదిరే కొన్ని మ్యాచ్ల షెడ్యూల్ను ముందుగా ప్రకటించి.. మిగతా మ్యాచ్ల తేదీలను తర్వాత ప్రకటిస్తాం. ఎన్నికల ముందు ఒక దశలో.. ఎన్నికల తర్వాత మరో దశలో మ్యాచ్లు నిర్వహించాలనుకుంటున్నాం. భారత్లోనే ఐపీఎల్ జరిగేలా కేంద్ర ప్రభుత్వం, సంబంధిత ఎజెన్సీలతో కలిసి పని చేస్తున్నాం.
ముందుగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాం. ఎన్నికల తేదీల ప్రకారం షెడ్యూల్ను ఖరారు చేయాల్సి ఉంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు లేవో.. ఎక్కడున్నాయో చూసుకొని షెడ్యూల్ను రూపొందిస్తాం. 'అని అరుణ్ సింగ్ ఓ జాతీయ ఛానెల్తో అన్నారు. ఇక మార్చి 22 నుంచి మే 30 లోపు ఐపీఎల్ 2024 సీజన్ను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ముందుగానే టోర్నీని ముగించాలనుకుంటోంది. ఈ సారి డబుల్ హెడర్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్నికలు, ఫలితాలు వెల్లడించే సమయంలో మ్యాచ్లు లేకుండా షెడ్యూల్ను రూపొందిస్తున్నట్లు సమాచారం.