
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడికి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఫిట్నెస్ కాపాడుకోవడం వారికి ఓ సవాల్గా మారింది. అందరూ అందుబాటులో ఉన్న వసతులతో ఫిట్నెస్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
టాప్ క్రికెటర్లలో పేసర్ మహ్మద్ షమీకి మాత్రమే సొంతంగా మైదానం ఉంది. యూపీలోని అతని స్వగ్రామం షాసాపూర్లో ఉన్న గ్రౌండ్లో షమీ రన్నింగ్ చేస్తున్నాడు. మిగిలిన వాళ్లంతా అవకాశం ఉన్నంతలో ఎక్సర్సైజులు చేస్తూ ఫిట్నెస్ కాపాడుకుంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ లాక్డౌన్ నిబంధనలు సడలిస్తే భారత క్రికెటర్లు మైదానాల్లో నాణ్యమైన శిక్షణను ప్రారంభించే అవకాశముంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్రెజరర్ అరుణ్ ధుమాల్ తెలిపారు.
మే 18 నుంచి నాలుగోవిడత లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి రానుండటంతో ఆటగాళ్లకు ప్రాక్టీస్ చేసే వెసులుబాటు దక్కవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
'క్రికెటర్లు నెట్ సెషన్స్లో పాల్గొనేందుకు అందుబాటులో ఉండే అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. లాక్డౌన్-4 మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలకు అనుమతిలేని పక్షంలో ఆటగాళ్ల నివాసాలకు దగ్గర్లోని మైదానాల్లో వారు ప్రాక్టీస్ చేసే అవకాశాలపై దృష్టి సారించాం. ఈ అంశంపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రయాణ ఆంక్షలు సడలించేదాకా ఎలాంటి శిబిరాలు ఏర్పాటు చేయం. ఆటగాళ్ల ఆరోగ్య భద్రతే మాకు అత్యంత ప్రధానం. లాక్డౌన్ ముగిశాక క్రికెటర్ల కార్యాచరణపై మాకు స్పష్టమైన ప్రణాళిక ఉంది'అని ధుమాల్ తెలిపారు.