ఏకపక్షంగా సాగుతున్న ఆసియాకప్ 2025 టోర్నీలో వేడి పుట్టించే మ్యాచ్కు రంగం సిద్దమైంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో దుబాయ్ వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్కు తెరలేవనుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తర్వాత తొలిసారిగా భారత్, పాకిస్థాన్ తలపడబోతున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి మంచి జోష్లో ఉన్నాయి. యూఏఈపై భారత్ గెలవగా.. ఒమన్పై పాక్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్కు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగుతుందని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తెలిపాడు. ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన డస్కాటే.. టీమిండియా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు ఉండవని హింట్ ఇచ్చాడు. 'పాకిస్థాన్తో మ్యాచ్పై ఉన్న సెంటిమెంట్ గురించి మాకు తెలుసు. ఈ విషయంపై జట్టు సమావేశంలో చర్చించాం. మేము ఆటగాళ్లం మాత్రమే. రాజకీయాలు, క్రీడలను వేరుగా చేసి చూడాలి. మా జట్టు సభ్యులంతా దేశంపై అభిమానాన్ని కలిగి ఉన్నారు. మైదానంలో ప్రొఫెషనల్గా వ్యవహరిస్తారు.

కేవలం క్రికెట్పై మాత్రమే దృష్టి పెట్టాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచించారు. పాకిస్థాన్తో మ్యాచ్కు ప్రత్యేకంగా ఎలాంటి సన్నాహాలు చేయలేదు. ఇతర మ్యాచ్ల్లానే పరిగణిస్తున్నాం. విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించాలనుకుంటున్నాం. ఆల్రౌండర్లు, స్పిన్నర్లతో జట్టు కూర్పు బాగుందని చెప్పాడు. జట్టులో నిలకడను కొనసాగించాలని భావిస్తున్నాం'అని తెలిపాడు. అతని వ్యాఖ్యల నేపథ్యంలో అర్ష్దీప్ సింగ్కు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.
పాకిస్థాన్తో మ్యాచ్లో ఎక్స్ట్రా పేసర్గా అర్ష్దీప్ సింగ్ను ఆడించాలని మాజీ క్రికెటర్లు సూచించినా.. టీమిండియా మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. రాత్రి వేళ మ్యాచ్ల్లో స్పిన్నర్లపై ఎక్కువ ఆధారపడటం టీమిండియాకు ప్రమాదమని రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు హెచ్చరించారు. కానీ భారత్ మాత్రం పేస్ ఆల్రౌండర్లు అయిన హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలపై నమ్మకం ఉంచింది. ఎక్స్ట్రా బ్యాటర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.
పాక్తో భారత తుది జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ.