టీమిండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఒమన్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ ఈ ఫీట్ సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్లో ఆడే అవకాశం అందుకున్న అర్ష్దీప్ సింగ్.. ఆఖరి ఓవర్లో ఒమన్ బ్యాటర్ వినాయక్ శుక్లా(1)ను ఔట్ చేసి అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు.
64 మ్యాచ్ల్లో అర్ష్దీప్ సింగ్ ఈ ఫీట్ సాధించడం గమనార్హం. ఈ జాబితాలో అర్ష్దీప్ సింగ్ తర్వాత యుజ్వేంద్ర చాహల్(80 మ్యాచ్ల్లో 96 వికెట్లు), హార్దిక్ పాండ్యా(116 మ్యాచ్ల్లో 95 వికెట్లు),జస్ప్రీత్ బుమ్రా(72 మ్యాచ్ల్లో 92 వికెట్లు), భువనేశ్వర్ కుమార్(87 మ్యాచ్లలో 90 వికెట్లు) కొనసాగుతున్నారు.ఈ మ్యాచ్లో టీమిండియా 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో గ్రూప్-ఏ టాపర్గా టీమిండియా సగర్వంగా సూపర్-4కు చేరింది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. సంజూ శాంసన్(45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 26), తిలక్ వర్మ(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 29) దూకుడుగా ఆడారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్(2/23), జితేన్(2/33), అమీర్ కలీమ్(2/31) రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం ఒమన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఒమన్ బ్యాటర్లలో అమీర్ కలీమ్(46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 64), హమ్మద్ మిర్జా(33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కెప్టెన్ జతిందర్ సింగ్(33 బంతుల్లో 5 ఫోర్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్ను టీమిండియా పూర్తిగా సన్నాహకంగా ఉపయోగించుకుంది. అందరికి బ్యాటింగ్ ఇవ్వడంతో పాటు బౌలింగ్ ఇచ్చింది.