జస్ప్రీత్ బుమ్రా కారణంగానే తనకు వికెట్లు దక్కుతున్నాయని టీమిండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ అన్నాడు. ఒక ఎండ్లో అతను కట్టడిగా బౌలింగ్ చేయడంతోనే మరో ఎండ్లో తనకు వికెట్ల లభిస్తున్నాయని తెలిపాడు. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన మూడో టీ20లో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.
అతని అద్భుత ప్రదర్శనతో ఈ మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండు మ్యాచ్ల తర్వాత భారత తుది జట్టులోకి వచ్చిన అర్ష్దీప్ సింగ్ ఈ అవకాశాన్ని అద్బుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. మూడు వికెట్ల ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తన ప్రదర్శన క్రెడిట్ జస్ప్రీత్ బుమ్రాదేనని తెలిపాడు.

'నేను నా ప్రక్రియను కొనసాగిస్తూ.. నైపుణ్యాలను నమ్ముతూ ప్రాక్టీస్ చేసిన ప్రణాళికలను అమలు చేస్తున్నాను. అవకాశం వచ్చినప్పుడు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం గొప్ప అనుభూతిస్తోంది. దూకుడుగా ఆడే బ్యాటర్ల వికెట్లు తీయడం మరింత ఆనందాన్నిచ్చింది. ఎవరైనా మనపై దూకుడుగా ఆడుతుంటే వికెట్లు తీసే అవకాశం దక్కుతుంది.
బుమ్రా లాంటి ఆటగాడు మరో ఎండ్లో బౌలింగ్ చేస్తున్నప్పుడు.. బ్యాటర్లు నాపై మరింత రిస్క్ తీసుకుంటారు. అది నాకు వికెట్లు తీసే అవకాశాలను ఇస్తుంది. నేను నా బౌలింగ్ను ఆస్వాదిస్తూ.. నా ప్రణాళికలను అమలు చేయడానికి ప్రయత్నిస్తాను. పరిస్థితలు ఎలా ఉన్నా సరే.. పవర్ ప్లే.. డెత్ ఓవర్లు అయినా.. నేను కేవలం నా ప్రణాళికలను అమలు చేయడంపైనే ఫోకస్ పెడుతాను. నా ప్రాక్టీస్కు కట్టుబడి బౌలింగ్ చేస్తాను.'అని అర్ష్దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ సన్నాహకల్లో భాగంగా జట్టులో ప్రయోగాలు చేస్తున్న గౌతమ్ గంభీర్ తొలి రెండు మ్యాచ్ల్లో అర్ష్దీప్ సింగ్కు అవకాశం ఇవ్వలేదు. ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్ కోసం హర్షిత్ రాణాను ఆడించారు. కానీ అతను బ్యాటింగ్లో రాణించినా.. బౌలింగ్లో విఫలమయ్యాడు. ఇక బుమ్రా-అర్ష్దీప్ సింగ్ కాంబినేషన్పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. వీరిది డెడ్లీ కాంబినేషన్ అని కొనియాడాడు.