పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అర్ష్దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే పంజాబ్ కింగ్స్ తరఫున 100 వికెట్ల మైలురాయి అందుకున్నతొలి బౌలర్గా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ ఈ ఫీట్ సాధించాడు.
ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ముంబై ఇండియన్స్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(2)ను క్యాచ్ ఔట్ చేయడం ద్వారా అర్ష్దీప్ సింగ్.. ఐపీఎల్లో 100 వికెట్ల క్లబ్లో చేరాడు. పంజాబ్ కింగ్స్ తరఫున ఏ బౌలర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఆ మరుసటి బంతికే సూర్యకుమార్ యాదవ్ను డకౌట్గా అర్ష్దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. పంజాబ్ కింగ్స్ తరఫున అర్ష్దీప్ సింగ్ తర్వాత మరే బౌలర్ కూడా 90 వికెట్లు తీయలేదు.

పంజాబ్ కింగ్స్ తరఫున 87 ఐపీఎల్ మ్యాచ్ల్లో అర్ష్దీప్ సింగ్(101* వికెట్లు) ఈ ఫీట్ సాధించాడు. అతని తర్వాత పియూష్ చావ్లా(84), సందీప్ శర్మ(73), అక్షర్ పటేల్ (61), మహమ్మద్ షమీ(58) వికెట్లు పడగొట్టారు. 2008-13 మధ్య పంజాబ్ కింగ్స్ తరఫున 87 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన పియూష్ చావ్లా 84 వికెట్లు తీసాడు. 2012-2021 వరకు పంజాబ్ కింగ్స్కు సందీప్ శర్మ 61 మ్యాచ్ల్లో 73 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్లో ఒక జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సునీల్ నరైన్ కొనసాగుతున్నాడు. 2012లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన ఈ వెస్టిండీస్ స్పిన్నర్ కేకేఆర్ తరఫున 193 మ్యాచ్లు ఆడి 195 వికెట్లు తీసాడు. జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున 154 మ్యాచ్లు ఆడి 183 వికెట్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.