టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని పులకేశినగర్ పోలీసులు స్టార్ క్రికెటర్ను అరెస్ట్ చేసేందుకు వారెంట్ జారీ చేశారు. ప్రావిడెంట్ ఫండ్(PF) విషయంలో రాబిన్ ఊతప్ప భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో పీఎఫ్ రిజినల్ కమీషనర్ గోపాల్ రెడ్డి ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
భారత మాజీ క్రికెటర్ను అదుపులోకి తీసుకోవాలని పులకేశినగర్ పోలీసులను ఆదేశించారు. ఊతప్ప.. సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల జీతాల్లో నుంచి పీఎఫ్ను కంట్రిబ్యూషన్ అమౌంట్ కట్ చేస్తున్న ఈ సంస్థ.. వారి ఖాతాల్లో మాత్రం జమచేయడం లేదు.

రూ. 23 లక్షల రూపాయలను ఈ కంపెనీ తమ ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్స్లో జమచేయలేదు. ఈ మోసాన్ని ప్రస్తావిస్తూ పీఎఫ్ కమిషనర్ ఈ నెల 4వ తేదీనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశిస్తూ లేఖను పంపించారు. అయితే ఊతప్ప ఇళ్లు మారడంతో అతనికి పంపించిన అరెస్ట్ వారెంట్ తిరిగి పీఎఫ్ ఆఫీస్కు వచ్చింది. భారత మాజీ క్రికెటర్ ఇళ్లును కనుగోవడంతో ఈ ఘటనపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
ఈ నెల 27 లోపు పీఎఫ్ అమౌంట్ జమచేయాలని లేదంటే అరెస్ట్ తప్పదని వారెంట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాబిన్ ఊతప్ప కుటుంబం దుబాయ్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. రాబిన్ ఊతప్ప భారత్ తరఫున 59 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. 54 వన్డేల్లో 1183 పరుగులు చేశాడు. ఐపీఎల్లోనూ పలు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.