
కొలంబో: శ్రీలంక పర్యటనకు టీమిండియా బీ టీమ్ రావడం తమ దేశ క్రికెట్కు ఘోర అవమానమని ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగా అన్నాడు. టీమిండియా సెకండ్ టీమ్తో సిరీస్లకు అంగీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు బుద్ది లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ప్రధాన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. శిఖర్ ధావన్ సారథ్యంలో యువ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం లంక టూర్కు వెళ్లిన విషయం తెలిసిందే.
జూలై 13 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లు జరగనున్నాయి. అయితే టెలివిజన్ మార్కెటింగ్లో భాగంగానే ఈ సిరీస్కు లంక క్రికెట్ బోర్డు ఒప్పుకుందని అర్జున రణతుంగా ఆరోపించాడు. తాజాగా పీటీఐతో మాట్లాడుతూ లంక బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
'ఇలా భారత రెండో జట్టు శ్రీలంక పర్యటనకు రావడం మా దేశ క్రికెట్ను అవమానించడమే. టెలివిజన్ మార్కెటింగ్ అవసరాల నేపథ్యంలో ఈ సిరీస్కు లంక బోర్డు అంగీకరించినట్లు అర్థమవుతోంది. భారత్ తమ బలమైన జట్టును ఇంగ్లండ్కు పంపించి బలహీనమైన రెండో జట్టును శ్రీలంకకు పంపించింది. దీనికి మా దేశ క్రికెట్ బోర్డు అసమర్థతతనే కారణం'అని రణతుంగా అసహనం వ్యక్తం చేశాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు అడ్మినిస్ట్రేషన్ లోపాల కారణంగా తమ దేశ ఆటగాళ్లకు క్రమశిక్షణ లేకుండా పోయిందని, ఆట కూడా దారుణంగా ఉందని ఇంగ్లండ్ పర్యటనను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అర్జున రణతుంగా సారథ్యంలోనే శ్రీలంక జట్టు 1996 వన్డే వరల్డ్ కప్ సాధించిన విషయం తెలిసిందే.
శిఖర్ ధావన్ నేతృత్వంలోని జట్టులో పరిమిత ఓవర్ల స్టార్స్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఉండగా.. ఐపీఎల్ స్టార్స్ దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియాలు కూడా అవకాశం దక్కించుకున్నారు.