Arjuna Ranatunga: శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అర్జున రణతుంగ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ జై షానే శ్రీలంక క్రికెట్ బోర్డును నడిపిస్తున్నాడని ఆరోపించాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు.. బీసీసీఐ చేతిలో కీలు బొమ్మల్లా మారారని, వారి ఆదేశాలను పాటిస్తూ జట్టును నాశనం చేశారని మండిపడ్డాడు.
'శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) అధికారులతో ఉన్న సత్సంబంధాలతో బీసీసీఐ సెక్రటరీ జైషా ఎస్ఎల్సీ బోర్డును శాసిస్తున్నాడు. శ్రీలంక క్రికెట్ను పూర్తిగా జైషానే నడిపిస్తున్నాడు. జై షా ఒత్తిడితోనే శ్రీలంక క్రికెట్ బోర్డు నాశనమవుతోంది. భారత్లో ఉంటూ శ్రీలంక బోర్డును సర్వనాశనం చేస్తున్నాడు. అతను చాలా పవర్ఫుల్. ఎందుకంటే అతని తండ్రి ఇండియా హోమ్ మినిస్టర్.'అని శ్రీలంకకు చెందిన ఓ న్యూస్ పేపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున రణతుంగా వ్యాఖ్యానించాడు.

శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీరియస్గా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఆ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సస్పెన్షన్ సత్వరమే అమల్లోకి వస్తుందని, షరతులను త్వరలోనే నిర్ణయిస్తుందని వెల్లడించింది. ఇక వన్డే ప్రపంచకప్ 2023లో పేలవ ప్రదర్శనతో శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC) కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది.
భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం అనంతరం శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘే ఎస్ఎల్సీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో మధ్యంతర కమిటీని నియమించారు. బోర్డు రద్దు తీర్మానానికి శ్రీలంక పార్లమెంట్ ఏకగీవ్రంగా ఆమోదం తెలిపింది.
ప్రపంచకప్ 2023 టోర్నీలో శ్రీలంక దారుణంగా విఫలమైంది. తొమ్మిది లీగ్ మ్యాచ్లకు రెండు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్, ఇంగ్లండ్పై విజయం సాధించిన శ్రీలంక మిగతా మ్యాచ్ల్లో ఓటమిపాలైంది.