ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024లో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఎలైట్ గ్రూప్ సీలో భాగంగా సోమవారం తమిళనాడుతో ముగిసిన మ్యాచ్లో అర్జున్ చెత్త ప్రదర్శన కనబర్చాడు. 12 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బ్యాటింగ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ(1, 8) దారుణంగా విఫలమయ్యాడు. పేలవ ఆటతీరుతో గోవా జట్టుకు భారంగా మారాడు.
ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన అర్జున్ టెండూల్కర్.. బ్యాటింగ్లో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు. బౌలింగ్లో నాలుగు వికెట్లు మాత్రమే తీసాడు. ఛండీఘర్తో జరిగిన మ్యాచ్లో 70 పరుగులతో క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడాడు.

ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 70 పరుగులు చేసి గోవా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఏడో వికెట్కు 127 పరుగులు జోడించాడు. కర్ణాటకతో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అర్జున్(52) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ రెండు ఇన్నింగ్స్లు మినహా ఈ సీజన్లో అతను రాణించిందేం లేదు.
ముంబై రంజీ జట్టులో చోటు కష్టమవడంతో గతేడాది గోవా జట్టుకు మారిన అర్జున్ టెండూల్కర్ తనకు వచ్చిన అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. సచిన్ కోసం అతన్ని ముంబై ఇండియన్స్ తమ జట్టుతో అంటిపెట్టుకున్నా.. తుది జట్టులో చోటు కల్పించినా.. ప్రభావం చూపలేకపోయాడు.
ఈ సీజన్లో అతను వరుసగా 11, 10, 70, 52, 6, 23, 18, 1, 8 పరుగులే చేసి విఫలమయ్యాడు. బౌలింగ్లో 2/94, 0/14, 1/70, 0/70, 1/30, 0/52, 0/5 చెత్త ప్రదర్శన కనబర్చాడు. ధారళంగా పరుగులిస్తుండటం.. బ్యాటర్లను ఏ మాత్రం ఇబ్బంది పెట్టకపోవడంతో గోవా కెప్టెన్ అతనికి బౌలింగే ఇవ్వడం లేదు. ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలో అర్జున్ టెండూల్కర్.. సచిన్ కొడుకు కాకపోయి ఉంటే కనీసం క్లబ్ స్థాయి క్రికెట్ ఆడేందుకు కూడా అర్హత సాధించేవాడు కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
తమిళనాడుతో సోమవారం ముగిసిన మ్యాచ్లో గోవా 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గోవా 241 పరుగులకు ఆలౌటైంది. ఆర్సీబీ బ్యాటర్ సుయాష్ ప్రభుదేశాయ్(104) సెంచరీతో చెలరేగగా.. సిద్దార్థ్(69) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 273 పరుగులు చేసింది. 32 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన గోవా 168 పరుగులకే కుప్పకూలింది. మరోసారి ప్రభుదేశాయ్(79) హాఫ్ సెంచరీతో రాణించాడు. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు 49.5 ఓవర్లలో 3 వికెట్లకు 142 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.