భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కొత్త అవతారమెత్తాడు. పేస్ ఆల్రౌండర్ అయిన అర్జున్ టెండూల్కర్ ఓపెనర్గా మారాడు. తన తండ్రి తరహాలో ఓపెనింగ్ బ్యాట్స్మన్గా రాణించాలని భావిస్తున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవాకు ఆడుతున్న అర్జున్ టెండూల్కర్.. ఛండీఘడ్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ ఓపెనర్గా బరిలోకి దిగాడు.
అంతకుముందు యూపీతో జరిగిన మ్యాచ్లోనూ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఈ రెండు ఇన్నింగ్స్ల్లో అర్జున్ టెండూల్కర్ అంచనాలను అందుకోలేకపోయాడు. యూపీతో మ్యాచ్లో 28 పరుగులు చేసిన అర్జున్.. 172 స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేశాడు. నాలుగు బౌండరీలు బాదాడు. చండీఘడ్తో మ్యాచ్లో మాత్రం 9 బంతుల్లో 3 బౌండరీలు బాది 14 పరుగులు చేసాడు. దురదృష్టవశాత్తు రనౌట్గా వెనుదిరిగాడు.

యూపీతో మ్యాచ్లో బౌలింగ్లో విఫలమైనా.. చండీఘడ్తో మాత్రం 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో గోవా 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీ బాదిన అర్జున్ టెండూల్కర్.. తాజా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతను ఇలానే రాణిస్తే ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున తుది జట్టులో ఆడే అవకాశం దక్కనుంది.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్ రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ టెండూల్కర్ను ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్ 2021లో ఈ క్యాష్ రిచ్ లీగ్కు ఎంట్రీ ఇచ్చిన అర్జున్.. ఐపీఎల్ 2023 సీజన్లో 4 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్ 2024లో ఒక మ్యాచ్ ఆడిన అర్జున్.. మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ అయిన సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ 2010లో 618 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.