
జైపూర్: ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ దుమ్మురేపాడు. హైదరాబాద్తో శుక్రవారం జరిగిన ఎలైట్ గ్రూప్ బీ మ్యాచ్లో అర్జున్(4/10).. బంతితో సత్తా చాటాడు. అర్జున్ ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు పూర్తిగా డిఫెన్స్కే పరిమితమయ్యారు. మొత్తం 4 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్.. ఒక ఓవర్ మెయిడిన్ చేయడంతో పాటు మొత్త 17 డాట్ బాల్స్ వేసాడు. ఓవర్కు రెండున్నర పరుగులు మాత్రమే ఇచ్చాడు. అర్జున్ బౌలింగ్లో హైదరాబాద్ బ్యాటర్లు కేవలం ఒకే బౌండరీ కొట్టడం విశేషం.
ఈ మ్యాచ్లో హైదరాబాద్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగగా.. ఆరంభంలోనే అర్జున్ ఓపెనర్ ప్రతీక్రెడ్డి(3)ని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఒకే ఓవర్లో రాహుల్ బుద్ది(8), రవి తేజ(4)లను ఔట్ చేశాడు. ఇక ఇన్నింగ్స్ 19వ ఓవర్ తొలి బంతికి క్రీజులో సెట్ అయిన వైస్ కెప్టెన్ తిలక్ వర్మ(46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 62)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఈ వికెట్తో హైదరాబాద్ భారీ స్కోర్కు బ్రేక్ వేసాడు. అయితే అర్జున్కు తోడుగా ఇతర గోవా ప్లేయర్లు రాణించకపోవడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. అర్జున్కు నాలుగు వికెట్లకు తోడుగా.. దర్శన్ మిసాల్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు.
ఈ టోర్నీ ప్రారంభానికి ముందే అర్జున్.. ముంబై జట్టు నుంచి గోవాకు మారిన విషయం తెలిసిందే. ముంబై జట్టులో పోటీ ఎక్కువగా ఉండటంతో.. అంతగా అవకాశాలు రాకపోవడంతో అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ టోర్నీ మూడో మ్యాచ్లో కెరీర్ బెస్ట్ బౌలింగ్తో అదరగొట్టాడు. ఆల్రౌండర్ అయిన అర్జున్.. లోయరార్డర్లో బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇదే ఫామ్ను అతను కొనసాగిస్తే.. ముంబై ఇండియన్స్ తరఫున వచ్చే ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. గత రెండేళ్లుగా ముంబై జట్టులో ఉన్న అతనికి తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ఐపీఎల్ 2022 సీజన్లో జట్టు దారుణంగా విఫలమైన నేపథ్యంలో అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం ఉంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.