ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సత్తా చాటాడు. దేశవాళీ క్రికెట్లో గోవా టీమ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్.. గ్రూప్-ఏలో భాగంగా ఒడిశాతో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లతో సత్తా చాటాడు. జైపూర్ వేదికగా శనివారం జరిగిన ఈ హైస్కోరింగ్ గేమ్లో అర్జున్ టెండూల్కర్(3/61) అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో గోవా విజయంలో కీలక పాత్ర పోషించాడు. క్రీజులో సెట్ అయిన బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు.
ఈ ప్రదర్శనతో సచిన్ కొడుకుపై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. అర్జున్ టెండూల్కర్ ఇదే జోరును కొనసాగించి ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ తుది జట్టులో చోటు దక్కించుకోవాలని సచిన్ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. రూ. 30 లక్షల కనీస ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

తాజా మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గోవా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 371 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఇషాన్ గాడేకర్(96 బంతుల్లో 12 ఫోర్లతో 93) తృటిలో శతకం చేజార్చుకోగా.. మరో ఓపెనర్ స్నేహ్(67), కెప్టెన్ దర్శన్ మిసల్(79), సుయాష్ ప్రభుదేశాయ్(74 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. సుయాష్ ప్రభుదేశాయ్ 22 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 74 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
అనంతరం ఒడిశా 49.4 ఓవర్లలో 344 పరుగులకు కుప్పకూలింది. స్వస్తిక్ సమాల్(57), గౌరవ్ చౌదరీ(78), సందీప్ పట్నాయ్(73), అసిర్వాద్ స్వైన్(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. కార్తీక్ బిస్వాల్(49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.