రంజీ ట్రోఫీలో సంచలన ప్రదర్శన కనబర్చిన టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్.. దేశవాళీ టీ20 టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. దేశవాళీ క్రికెట్లో గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్.. రంజీ ట్రోఫీ ఐదో రౌండ్ మ్యాచ్లో 5 వికెట్లతో సత్తా చాటిన విషయం తెలిసిందే.
ఆ మ్యాచ్తో కెరీర్లో ఫస్ట్ ఫైవ్ వికెట్ హాల్ అందుకున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అర్జున్ టెండూల్కర్ ఐదు వికెట్లతో సత్తా చాటడంతో అతని కోసం ఫ్రాంచైజీలు పోటీపడుతాయని అంతా అనుకున్నారు. కానీ కీలక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా శనివారం ముంబైతో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ తేలిపోయాడు.

4 ఓవర్లు 48 పరుగులు..
ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(57 బంతుల్లో 11 ఫోర్లు, 10 సిక్సర్లతో 130 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో అర్జున్ టెండూల్కర్ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్ టెండూల్కర్ ఓవర్కు 12 పరుగుల చొప్పున 48 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
సరిగ్గా మేగా వేలానికి ముందే అర్జున్ టెండూల్కర్ తేలిపోవడం అతనికి తీవ్ర నష్టం చేయనుంది. టీ20 ఫార్మాట్కు అర్జున్ సెట్ అవ్వడనే సంకేతాన్నిస్తోంది. ఈ ప్రదర్శన ఆదివారం, సోమవారం జరిగే మెగా వేలంలో అతన్ని ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడంపై ప్రభావితం చేస్తోంది.
అన్సోల్డ్ లిస్ట్లోకేనా..?
రూ. 30 లక్షల కనీస ధరతో వేలానికి అందుబాటులో ఉన్న అర్జున్ టెండూల్కర్ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయవచ్చు. లేదంటే అతను అన్సోల్డ్ లిస్ట్లో చేరుతాడు. గత రెండు సీజన్లలో అతన్ని ముంబై ఇండియన్స్ కనీస ధరకు కొనుగోలు చేసింది.
ముంబై ఇండియన్స్ తరఫున 5 మ్యాచ్లు ఆడిన అర్జున్ టెండూల్కర్ మూడు వికెట్లు మాత్రమే తీసాడు. సచిన్పై ఉన్న అభిమానంతో ఏదైనా ఫ్రాంచైజీ అర్జున్ టెండూల్కర్ను కొనుగోలు చేయవచ్చు.
అయ్యర్ ఊచకోత..
మరోవైపు మెగా వేలానికి ఒక్క రోజు ముందు శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. 11 ఫోర్లు, 10 సిక్సర్లతో ఫ్రాంచైజీలకు సవాల్ విసిరాడు. అతని సూపర్ బ్యాటింగ్తో ఈ మ్యాచ్లో ముంబై 26 పరుగుల తేడాతో గోవాను ఓడించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై.. అయ్యర్ ఊచకోతతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 250 పరుగుల భారీ స్కోర్ చేసింది. పృథ్వీ షా(22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 33) దూకుడుగా ఆడగా.. షామ్స్ ములానీ(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 41) మెరుపులు మెరిపించాడు.
అయ్యర్కు రూ. 25 కోట్లు..
అనంతరం గోవా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ సుయాష్ ప్రభుదేశాయ్(32 బంతుల్లో 9 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. అర్జున్ టెండూల్కర్(4 బంతుల్లో 2 ఫోర్లతో 9) బ్యాటింగ్లోనూ నిరాశపరిచాడు. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన అయ్యర్ కోసం మెగా వేలంలో ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి.
గత సీజన్లో కేకేఆర్కు సారథిగా వ్యవహరించి టైటిల్ అందించిన అయ్యర్.. ఈ సారి మెగావేలంలోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ ఆఫర్ చేయడంతోనే అతను కేకేఆర్ రిటెన్షన్కు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అతను సునాయసంగా రూ. 20-25 కోట్లు పలికే ఛాన్స్ ఉంది.