భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్కు ఊహించని షాక్ తగిలింది. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ ఫైనల్లో అర్జున్ టెండూల్కర్కు అవకాశం దక్కలేదు. దేశవాళీ క్రికెట్లో అర్జున్ టెండూల్కర్ గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
నాగాలాండ్తో గురువారం ప్రారంభమైన ఫైనల్లో గోవా టీమ్మేనేజ్మెంట్ అర్జున్ టెండూల్కర్కు చోటివ్వలేదు. దాంతో అతను బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడిన అర్జున్ టెండూల్కర్ 16 వికెట్లు పడగొట్టాడు. గోవా తరఫున మూడో హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. అయినా అతన్ని తుది జట్టులోకి తీసుకోలేదు.

వైట్బాల్ క్రికెట్లో అర్జున్ తడబడినా.. రంజీ ట్రోఫీలో మాత్రం మెరుగైన ప్రదర్శనే చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తొలిసారి అర్జున్ టెండూల్కర్ను పక్కనపెట్టిన గోవా టీమ్.. ఆ తర్వాత విజయ్ హాజారే ట్రోఫీలోనూ చోటివ్వలేదు. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లోనైనా అతనికి చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ గోవా మేనేజ్మెంట్ సచిన్ తనయుడిని పక్కకు పెట్టేసింది.
ముంబై జట్టులో అవకాశాలు దక్కకపోవడంతోనే అర్జున్ టెండూల్కర్ గోవాకు మారాడు. ఇప్పుడు ఆ జట్టులోనూ అతనికి తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో అర్జున్ టెండూల్కర్ ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. నాగాలాండ్తో జరిగిన ప్లేట్ గ్రూప్లో ఐదు వికెట్లతో సత్తా చాటాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో అర్జున్ టెండూల్కర్ను ముంబై ఇండియన్స్ అతని కనీస ధర రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. 2021లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ 2023లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు.
అర్జున్ టెండూల్కర్ దేశవాళీ సీజన్ అనూహ్యంగా ముగియడంతో ఐపీఎల్ 2025 సీజన్లోనూ అవకాశాలు దక్కాలని సచిన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన గోవా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 7 వికెట్లకు 258 పరుగులు చేసింది.