సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సంచలన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలిసారి ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. ఈ టోర్నీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్నఅర్జున్ టెండూల్కర్.. ప్లేట్ గ్రూప్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో నిప్పులు చెరిగాడు. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్(5/25) ధాటికి అరుణాచల్ ప్రదేశ్ 84 పరుగులకే కుప్పకూలింది.
ఈ మ్యాచ్లో మొత్తం 9 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్ టెండూల్కర్ 3 ఓవర్లు మెయిడిన్ చేసి 25 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ఐదు వికెట్లలో ముగ్గురు బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ అవ్వడం విశేషం.

ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే అరుణాచల్ ప్రదేశ్ ఓపెనర్ నబమ్ హచాంగ్(0)ను క్లీన్ బౌల్డ్ చేసిన అర్జున్ టెండూల్కర్.. ఆ తర్వాత మరో ఓపెనర్ నీలమ్ ఓబీ(22), చిన్మయ్ పాటిల్(3), జై భావ్సర్(0), మోజీ ఈటె(1)లను పెవిలియన్ చేర్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అర్జున్ టెండూల్కర్కు ఇదే ఫస్ట్ ఫైవ్ వికెట్ హాల్ కావడం విశేషం. 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల తర్వాత అర్జున్ ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
అర్జున్ ధాటికి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న అరుణాచల్ ప్రదేశ్ 36 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అర్జున్కు తోడుగా మోహిత్ రెడ్కర్(3/15), మార్క్ పింటో(2/31) సత్తా చాటారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన గోవా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 414 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఈ మ్యాచ్కు ముందు అర్జున్ టెండూల్కర్ 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 32 వికెట్లు తీసాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 4/49గా ఉంది. బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న అర్జున్ టెండూల్కర్ 23.13 సగటుతో 532 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న అర్జున్ టెండూల్కర్కు ఈ ప్రదర్శన ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వనుంది.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందే అర్జున్ టెండూల్కర్.. 5 వికెట్ల ఘనత సాధించి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. అతని కోసం ఫ్రాంచైజీలు బిడ్ వేసే అవకాశం ఉంది.