ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 సీజన్కు రంగం సిద్ధమైంది. నేడు(శుక్రవారం) విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఆరంభ వేడుకలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఏపీఎల్ అంబాసిడర్, టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ ఆరంభ వేడుకల్లో హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ చిందేయనుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల తన పాటలతో అలరించనున్నాడు. లేజర్ షో, డ్రోన్ షో కూడా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ టోర్నీలో మొత్తం 7 జట్లు బరిలోకి దిగుతుండగా.. మొత్తం 25 మ్యాచ్లు జరగనున్నాయి. వీటిలో 21 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఉంటాయి. కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్తో ఈ టోర్నీకి తెరలేవనుంది. ఈ టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు రూ. 35 లక్షలు, రన్నరప్కు రూ. 20 లక్షలు ప్రైజ్మనీ లభిస్తాయి. ఈ మ్యాచ్లను చూసేందుకు అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించారు.

హనుమ విహారి, శ్రీకర్ భరత్తో పాటు షేక్ రషీద్, రికీ భుయ్ వంటి దేశవాళీ స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీ బరిలోకి దిగుతున్నారు. గాయం కారణంగా ఈ టోర్నీకి నితీష్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు. తొలి రోజు ఒకే ఒక్క మ్యాచ్ జరగనుండగా.. తర్వాత ప్రతీ రోజు రెండు మ్యాచ్లు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుండగా.. రెండో మ్యాచ్ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. అన్ని మ్యాచ్లు వైజాగ్ వేదికగానే జరగనున్నాయి.
ఏపీఎల్ మ్యాచ్లు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో పాటు ఫ్యాన్ కోడ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఫ్రీగా చూడాలంటే జియో టీవీ యాప్లో సోనీ స్పోర్ట్స్ ఛానెల్ను సెలెక్ట్ చేసి చూడవచ్చు.