హైదరాబాద్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) సీజన్ 2 విజేతగా రాయలసీమ కింగ్స్ నిలిచింది. కోస్టల్ రైడర్స్తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో రాయలసీమ కింగ్స్ వీజేడీ(వి జయదేవన్ సిస్టమ్) పద్దతిన 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో వీజేడీ పద్దతిన ఫలితాన్ని తేల్చారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోస్టల్ రైడర్స్ నిర్ణీత 18 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. మద్దిల వర్దన్(32 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. ధరణి కుమార్(23 బంతుల్లో 5 ఫోర్లతో 30) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాయలసీమ కింగ్స్ బౌలర్లలో హరిశంకర్ రెడ్డి రెండు వికెట్లు తీయగా.. ఎస్కే కామ్రుద్దిన్ మూడు వికెట్లు పడగొట్టాడు.

జాగర్లపూడి రామ్, బోధల కుమార్, హనుమ విహారి తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాయల సీమ కింగ్స్ 16.3 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసి వీజేడీ పద్దతిన గెలిచింది. లక్ష్యచేధనలో ఓపెనర్లు కోగటమ్ రెడ్డి(0) గోల్డెన్ డకౌటవ్వగా.. వంశీ కృష్ణ(3)తీవ్రంగా నిరాశపరిచాడు. తోట శరణ్(24) కూడా ఔటవ్వడంతో రాయలసీమ్ కింగ్స్ 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో కెప్టెన్ హనుమ విహారీ(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 46 నాటౌట్), బోదల కుమార్(23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 53)కలిసి జట్టును ఆదుకున్నాడు. కుమార్ ఔటైనా.. అల్లారెడ్డి రెడ్డి(4) నిరాశపరిచినా.. గిరినాథ్ రెడ్డి(29 నాటౌట్) సాయంతో విహారి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. కోస్టల్ రైడర్స్ బౌలర్లలో ఆశిష్, చీపురుపల్లి స్టీఫెన్ రెండేసి వికెట్లు తీయగా.. షేక్ అబ్దుల్లా ఓ వికెట్ పడగొట్టాడు.
ఈ ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా హాజరైన బీసీసీఐ మాజీ సెలెక్టర్, దిగ్గజ ఆటగాడు కృష్టమాచారి శ్రీకాంత్.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)పై ప్రశంసల జల్లు కురిపించాడు.
'ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనితీరు అద్భుతం. ఏపీలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. వారిని ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏపీఎల్ తరహా టోర్నీల ద్వారా క్రికెటర్లకు అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ఏపీ నుంచి దేశానికి మరింత మంది ప్రాతినిధ్యం వహించేలా ఏసీఏ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి'అని సూచించారు.