విశాఖపట్నం: ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) రెండో సీజన్కు రంగం సిద్దమైంది. సాగర తీరం విశాఖపట్నంలోని వైఎస్సార్ స్డేడియం వేదికగా బుధవారం ఈ లీగ్కు తెరలేవనుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలోని ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పర్యవేక్షణలో రోజుకు రెండు మ్యాచ్ల చొప్పున మొత్తం 19 మ్యాచ్లు జరగనున్నాయి.
ఈ నెల 27న జరిగే ఫైనల్తో ఈ సీజన్ ముగియనుండగా మొత్తం ఆరు ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. తొలి సీజన్ ఫైనల్లో తలపడిన బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్తో ఏపీఎల్-2కు తెరలేవనుంది. విశాఖ వేదికగా జరిగే ఈ మ్యాచ్లను ప్రేక్షకులు ఫ్రీగా చూడవచ్చు. ఈ మ్యాచ్లకు హాజరయ్యే అభిమానులకు లక్కీ డీప్ ద్వారా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు అందించనున్నారు.

ఇప్పటికే ఈ సీజన్కు సంబంధించి అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన నిర్వహకులు.. రాజకీయ, సినీ ప్రముఖులతో కూడా ప్రచారం చేయించారు. ఈ సీజన్ తొలి మ్యాచ్కు సినీ హీరోయిన్ శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరుకానుందని నిర్వహకులు ప్రకటించారు. తన అందం, అభినయంతో కుర్రళ్లను కట్టిపడేస్తున్న శ్రీలీల ఏపీఎల్ ప్రారంభ మ్యాచ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ చానెల్ ఇంగ్లీష్ కామెంట్రీతో ప్రసారం చేయనుండగా.. ఫ్యాన్ కోడ్ యాప్ తెలుగు కామెంట్రీ కూడా అందించనుంది. ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ సీ వెంకటేశ్తో పాటు ఇతర మాజీ క్రికెటర్లు తెలుగులో వ్యాఖ్యానం చేయనున్నారు. తొలి మ్యాచ్ ఈ రోజు 5 గంటలకు ప్రారంభం కానుంది.

కోస్టల్ రైడర్స్, గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, బెజవాడ టైగర్స్తో మొత్తం 6 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఐపీఎల్ తరహాలోనే ఈ టోర్నీ జరగనుంది. లోకల్ ప్లేయర్లతో ఇతర రాష్ట్రల ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. ఇతర రాష్ట్రాల ఆటగాళ్లు నలుగురు మాత్రమే బరిలోకి దిగాలి.
ఇక, టీమిండియా స్టార్లు హనుమ విహారి, శ్రీకర్ భరత్ లీగ్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. రాయలసీమ కింగ్స్కు విహారి, ఉత్తరాంధ్ర లయన్స్కు భరత్, కోస్టల్ జట్టుకు రషీద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.