
విశాఖపట్నం: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) 2022 సీజన్ ఫైనల్కు బెజవాడ టైగర్స్ టీమ్ దూసుకెళ్లింది. శనివారం రాయలసీమ కింగ్స్తో జరిగిన క్వాలిఫయర్2 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో పాయింట్స్ టేబుల్లో మెరుగైన స్థానం కలిగి ఉన్న బెజవాడ టైగర్స్ ముందంజ వేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయలసీమ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఆ జట్టులో గిరినాథ్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. రషీద్ (35 బంతుల్లో 40 నాటౌట్) రాణించాడు. బెజవాడ బౌలింగ్లో లలిత్(2/29) రెండు వికెట్లు తీయగా.. మనీశ్(1/25) ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన బెజవాడ టైగర్స్ వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపేసారు. దాంతో టోర్నీ నిబంధనల ప్రకారం పాయింట్స్ టేబుల్లో రాయలసీమ కింగ్స్ కన్నా ముందంజలో ఉన్న బెజవాడ టైగర్స్ ఫైనల్ చేరింది. రాయలసీమ కింగ్స్ రాత సరిగ్గా లేక ఫైనల్ చేరలేకపోయింది. మెరుగైన రన్ రేట్ బెజవాడకు కలిసొచ్చింది.
ఆదివారం జరిగే ఫైనల్లో కోస్టల్ రైడర్స్తో బెజవాడ టైగర్స్ తలపడనుంది. ఈ టైటిల్ ఫైట్కు భారత దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. లోకల్ టాలెంట్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) బీసీసీఐ ఆమోదంతో ఈ టోర్నీని ప్రారంభించింది. ఈ టోర్నీ ఫస్ట్ ఎడిషన్ సూపర్ సక్సెస్ సాధించింది. నేటి ఫైనల్ మ్యాచ్ ఫ్యాన్ కోడ్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్తో పాటు స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానెల్లో వీక్షించవచ్చు.