మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. అద్వితీయమైన ప్రదర్శనతో అర్దశతాబ్దపు కలను సాకారం చేసుకుంది. 1983 ప్రపంచకప్లో కపిల్ సేన సాధించిన విజయం భారత క్రికెట్ గతిని మార్చినట్టే.. హర్మన్ సేన సాధించిన తాజా విజయం మహిళల క్రికెట్ను మరో మెట్టిక్కించనుంది.
ఈ విజయం నేపథ్యంలో భారత మహిళా క్రికెటర్లపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రూ. 51 కోట్ల నజరానా ప్రకటించగా.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, క్రికెట్ అసోసియేషన్స్ కూడా తమ ఆటగాళ్లకు క్యాష్ ప్రైజ్ ప్రకటించాయి.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కు చెందిన భారత లెఫ్టార్మ్ స్పిన్నర్, కడప అమ్మాయి శ్రీ చరణికి కూడా ఏపీ సర్కార్ నుంచి భారీ బహుమతి లభించనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వన్డే ప్రపంచకప్ ఆడిన ప్లేయర్గా నిలిచిన నల్లపురెడ్డి శ్రీచరణిని ఏపీ ప్రభుత్వం ఘనంగా సన్మానించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం, భారీ నజరానా ప్రకటించేందుకు సిద్దమవుతుంది. ప్రస్తుతానికి ఈ విషయాలు అధికారికంగా వెల్లడి కాకపోయినా.. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచకప్ గెలిచిన శ్రీచరణి ప్రస్తుతం జట్టుతో న్యూఢిల్లీలో ఉంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన హర్మన్సేన.. గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైంది. శుక్రవారం విజయవాడకు రానున్న శ్రీ చరణికి ఘన స్వాగతం పలికేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) భారీ ఏర్పాట్లు చేస్తోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏసీఏ సిద్దమైంది.
మెరుగైన ప్రదర్శనతో ఆంధ్ర గర్వపడేలా చేసిన శ్రీచరణిని సీఎం చంద్రబాబు నాయుడితో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సన్మానించనున్నారు. ఈ సందర్భంగానే ఆమెకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు క్యాష్ ప్రైజ్, ఇంటి స్థలంను బహుమతిగా అందజేయనున్నారు. అయితే ఈ విషయంపై ఏపీ సర్కార్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ శ్రీచరణి సాధించిన విజయానికి ఏపీ సర్కార్ ఫిదా అయ్యిందని, అదిరిపోయే బహుమతి ఇవ్వాలనుకుంటుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
గతంలో ఒలింపిక్ మెడల్ గెలిచిన పీవీ సింధుకు గ్రూప్-1 ఉద్యోగంతో పాటు రూ. 3కోట్ల క్యాష్ ప్రైజ్, నివాస స్థలం బహుమతిగా అందజేశారు. బ్యాడ్మింటన్ అకాడమీకి కావాల్సిన స్థలాన్ని కూడా ఇచ్చారు. శ్రీ చరణికి కూడా అదే తరహాలో భారీ రివార్డ్ దక్కనున్నట్లు తెలుస్తోంది.
ఈ టోర్నీలో 21 ఏళ్ల శ్రీ చరణి.. అదరగొట్టింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ఈ ఆంధ్రా అమ్మాయి 9 మ్యాచ్ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. ఈ 9 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్లో వికెట్ తీసింది. ముఖ్యంగా సెమీస్, ఫైనల్లో ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్ టీమిండియా విజయానికి బాటలు వేసింది. ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచింది. వన్డే ప్రపంచకప్ ముందే భారత మహిళల జట్టుతో నారా లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమయంలోనే శ్రీ చరణి క్రికెట్ జర్నీ గురించి లోకేష్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కాబట్టి ఆమెకు భారీ బహుమతే దక్కుతుందని ఏసీఏ వర్గాలు భావిస్తున్నాయి.