
అమరావతి: అండర్ 19 ప్రపంచకప్ టీమ్ వైస్ కెప్టెన్, తెలుగు క్రికెటర్ షేక్ రషీద్కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. వెస్టిండీస్ వేదికగా జరిగిన మెగా టోర్నీలో యశ్ ధుల్ నేతృత్వంలోని యంగ్ ఇండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. భారత జట్టు విజయంలో గుంటూరుకు చెందిన షేక్ రషీద్ కీలక పాత్ర పోషించాడు. కీలక మ్యాచ్ల్లో సత్తా చాటి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.
ఈ విజయం నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని షేక్ రషీద్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా రషీద్ను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. గుంటూరులో యువ క్రికెటర్ కుటుంబానికి నివాస స్థలాన్ని కేటాయించడంతో పాటు ప్రభుత్వం తరపున రషీద్కు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల నగదు పురస్కారం అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కూడా తెలిపారు. షేక్ రషీద్కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రకటించిన రూ.10 లక్షల చెక్ను వైస్ జగన్ చేతుల మీదుగా అందజేశారు. యువ క్రికెటర్ షేక్ రషీద్ డిగ్రీ పూర్తి కాగానే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ అధికారుల్ని ఆదేశించారు.
అండర్ 19 ప్రపంచకప్లో రషీద్ భారత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో రషీద్ నాలుగు మ్యాచ్లు ఆడి 50.25 సగటుతో 201 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కరోనా బారిన పడటంతో అతను రెండు మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఓపెనర్లు విఫలమైన భారత్ చాంపియన్గా నిలిచిందంటే.. మూడో స్థానంలో రషీద్.. 4వ స్థానంలో యశ్ ధుల్ (4 మ్యాచ్ల్లో 76.33 సగటుతో 229) గొప్పగా రాణించడం వల్లే. సెమీస్లో మూడో వికెట్కు 204 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆ మ్యాచ్లో యశ్ శతకం చేయగా.. రషీద్ 94 పరుగులు చేసాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో షేక్ రషీద్ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తికనబర్చలేదు. 17 ఏళ్ల వయసు కావడంతోనే అతన్ని పక్కనపెట్టేసాయి.