ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఇష్టమైన క్రికెట్ ఎవరో చెప్పారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీనే తన ఫేవరేట్ క్రికెటర్ అని తెలియజేశారు. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటే కోహ్లీనే ఎక్కువ ఇష్టపడుతానని స్పష్టం చేశారు.
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆహా వేదికగా టాలీవుడ్ అగ్ర హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్-4 అక్టోబర్ 25 నుంచి మొదలుకానుంది. ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడుతో మొదటి ఎపిసోడ్ షూట్ చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రమోషన్స్ను ఆహా ప్రారంభించింది.

ఈ క్రమంలో ఓ ప్రోమోను విడుదల చేసింది. 5 నిమిషాల 30 సెకండ్లపాటు ఉన్న ఈ ప్రోమోలో బావా బామ్మర్దులైన చంద్రబాబు, బాలయ్య మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. బాలయ్య కొన్ని రంగాలకు చెందిన ప్రముఖుల ఫోటోలను స్క్రీన్పై చూపిస్తూ.. వీరిలో ఎవరు ఇష్టం అంటూ తన బావ చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు.
బామ్మర్ది అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు తనదైన శైలిలో బదులిచ్చారు. ఈ క్రమంలో టీమిండియా క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఫోటోలను చూపిస్తూ.. 'బావ మీరేమో ధోనీ లాంటి లీడర్.. నేనేమో విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడిని'అని అన్నాడు. వెంటనే చంద్రబాబు 'నేను ఎప్పుడూ విరాట్ కోహ్లీని ఇష్టపడుతాను'అని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. పూర్తి ఎపిసోడ్ అక్టోబర్ 25 రాత్రి 8.30 గంటలకు ఆహాలో స్ట్రీమ్ కానుంది.
Babu garu.. @ncbn 👎 pic.twitter.com/OizQAfLUdT
— H A N U (@HanuNews) October 22, 2024