ఒకరితో ఒకరు పోటీ
'టేక్ ఏ బ్రేక్' పేరుతో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఒకరితో ఒకరు పోటీపడ్డారు. ఒకరి గురించి మరొకరికి ఎంత తెలుసో, ఇద్దరిలో ఎవరు బెటరో అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. వీడియోలో మొదటగా అనుష్క మాట్లాడుతూ.. హాయ్ ఇన్స్టాగ్రామ్!! నేను హీరోయిన్ అనుష్క శర్మను, ఇతను క్రికెటర్ విరాట్ కోహ్లీ అని చెప్పారు. ఆపై విరాట్ మాట్లాడుతూ... ఈరోజు ఇద్దరం మూడు రౌండ్లలో పోటీపడుతున్నాం. వృత్తులు, ఇష్టాఇష్టాలు మరియు మరికొన్ని విషయాల గురించి ప్రశ్నలు సంధించుకుంటాం. ఎవరు గెలుస్తారో చూద్దాం అని తెలిపాడు.
తడబడ్డ విరాట్
కోహ్లీ-అనుష్క తొలిరౌండ్లో తమ వృత్తుల గురించి ప్రశ్నించుకున్నారు. భారత్లో నిర్మించిన తొలి హిందీ ఫీచర్ ఫిల్మ్ ఏదని అనుష్క ప్రశ్నించగా.. విరాట్ తడబడ్డాడు. ఆపై 'మేరా అంజాన్' అని కోహ్లీ చెప్పగా.. అనుష్క నవ్వి 'రాజా హరిశ్చంద్ర' అని చెప్పారు. ఆ తర్వాత క్రికెట్ నేపథ్యంలో వచ్చిన రెండు సినిమాల పేర్లు చెప్పమని అడగ్గా.. లగాన్, పటియాలా హౌజ్ అని విరాట్ వెంటనే సమాధానం చెప్పాడు. మొత్తానికి విరాట్ రెండు సరైన సమాధానాలు చెప్పాడు.
ప్రాథమిక నిబంధనలు అడగ్గా
ఆపై క్రికెట్లో మూడు ప్రాథమిక నిబంధనలు చెప్పమని విరాట్ కోహ్లీ అడగ్గా... 'ఔటవ్వొద్దు, ఆటను వదిలేయొద్దు అని అనుష్క శర్మ నవ్వుతూ బదులిచ్చింది. ఆ తర్వాత సరైన సమాధానాలు చెప్పింది. పవర్ ప్లేలో నలుగురు మాత్రమే సర్కిల్ బయట ఉండాలి, నేరుగా బంతి లైన్ ఆవల పడితే సిక్స్, ఆలా కాకుండా వెళితే ఫోర్ అని అనుష్క చెప్పారు. మహిళల క్రికెట్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ ఎవరని అడగ్గా.. జులన్ గోస్వామి అని ఠక్కున చెప్పేసారు బాలీవుడ్ ముద్దుగుమ్మ.
గొడపడితే
వ్యక్తిగతానికి వస్తే ఒకరినొకరు సంతోషంగా ఉంచడానికి ఏం చేస్తారు? ఫలానా తేదీన ఎక్కడికి వెళ్లాం? వంటి ప్రశ్నలు అడిగారు. 'నన్ను ఎవరు సంతోషంగా ఉంచుతారు?' అని అనుష్క శర్మ అడగ్గా.. 'మూగజీవులు' అని విరాట్ కోహ్లీ చెప్పాడు. అయితే 'నువ్వు కదా నన్ను సంతోషంగా ఉంచేది' అని మళ్లీ ప్రశ్నించగా.. అవును కదా! అని విరాట్ నవ్వేసాడు. ఇక సినిమాలకు వెళ్తే ఎవరు నిద్రపోతారు? అంటే తానేనని కోహ్లీ చెప్పాడు. ఇద్దరూ గొడపడితే ముందుగా తానే క్షమాపణ చెబుతానని, ఇద్దరూ పోట్లాడుకుంటే కోహ్లీ ఓడిపోతాడని అనుష్క తెలిపారు. ప్రస్తుతం కోహ్లీ-అనుష్క సరదా వీడియో వైరల్గా మారింది. అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.
2017లో వివాహం
విరుష్క జోడీ 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో మొదటిసారి కలుసుకున్నారు. నాలుగేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన విరాట్-అనుష్క.. 2017, డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు. కోహ్లీతో వివాహం అయినప్పటి నుండి అనుష్క పెద్దగా సినిమాలు చెయ్యట్లేదు. పూర్తి సమయం కోహ్లీతోనే గడుపుతున్నారు. 32 ఏళ్ల అనుష్క శర్మ చివరిగా 'జీరో' సినిమాలో వెండితెరపై కనిపించారు. షారుక్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా.. ఆశించిన మేర ఆడలేదు. ఆపై 'అంగ్రేజీ మీడియం'లో అతిథిగా పాత్ర పోషించారు.