టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫిట్నెస్ విషయంలో కోహ్లీని అనుసరించే వాళ్లు చాలా మంది ఉన్నారు. అతను వరల్డ్ బెస్ట్ బ్యాటర్గా ఎదగడానికి ప్రధాన కారణం కూడా ఫిట్నెస్సే. ఫిట్నెస్ విషయంలో చాలా క్రమశిక్షణగా ఉండే కోహ్లీ.. టీమిండియా మొత్తానికి ఆ అలవాటు చేశాడు.
జట్టులో ఫిట్నెస్ విప్లవాన్ని తీసుకొచ్చాడు. డైట్ విషయంలో కోహ్లీ చాలా కఠినంగా ఉంటాడు. ఈ విషయాన్ని అతనే చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు. తాజాగా కోహ్లీ ఆహారపు అలవాట్ల గురించి అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కోహ్లీ డైట్ సీక్రెట్ను బయటపెట్టింది.

'విరాట్ కోహ్లీ ఫిట్నెస్, డైట్ విషయం చాలా క్రమశిక్షణతో ఉంటాడు. ఫిట్గా ఉండాలంటే ఆహారంతో పాటు వ్యాయమం ముఖ్యమని భావిస్తాడు. ప్రస్తుతం సినీ తారాలు కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. విరాట్ కోహ్లీ ఉదయం నిద్ర లేచిన వెంటనే కార్డియో ఎక్సర్సైజ్ చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మిస్ చేయడు. ఆ తర్వాత నాతో కాసేపు గడిపి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాడు.
ఆహారపు అలవాట్ల విషయంలో విరాట్ కోహ్లీలా ఎవరూ ఉండలేరు. అతను జంక్ ఫుడ్ అస్సలు తినడు. కూల్ డ్రింక్స్ అస్సలు తాగడు. గత 10 ఏళ్లుగా కోహ్లీ బటర్ చికెన్ కూడా తినలేదు. ఇవన్నీ నమ్మశక్యంగా లేకున్నా.. వాస్తవం. నిద్రకు కోహ్లీ చాలా ప్రాధాన్యత ఇస్తాడు. నిద్ర విషయంలో ఏ మాత్రం రాజీపడడు.
ప్రతీ రోజు సరైన సమయానికి నిద్రపోతాడు. సరిగ్గా నిద్రపోతేనే ఉత్తమంగా పనిచేయగలమని కోహ్లీ తరుచూ చెబుతుంటాడు. నిద్ర మాత్రమే మనం నియంత్రించుకోగలమంటాడు. విరాట్ కోహ్లీ వరల్డ్ బెస్ట్ బ్యాటర్ మాత్రమే కాదు. తన ఫిట్నెస్, డైట్ విషయంలో ప్రతీ ఒక్కరికి స్ఫూర్తినిచ్చే వ్యక్తి.'అని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్నాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో కోహ్లీ సెంచరీతో సత్తా చాటాడు. అడిలైడ్ వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యే రెండో టెస్ట్లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటున్నాడు. డే/నైట్ జరిగే ఈ మ్యాచ్ కోసం కోహ్లీ సిద్దమయ్యాడు.