టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొడుకు అహాన్ను స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ముద్దాడింది. ఇందుకు సంబంధించిన క్యూట్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీకి కెరీర్లో ఇది 300వ వన్డే కావడంతో ఈ మ్యాచ్కు అనుష్క శర్మ ప్రత్యేకంగా హాజరైంది. మరోవైపు రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే సైతం ఈ మ్యాచ్కు వచ్చింది.
ఈ మ్యాచ్ జరుగుతుండగా.. రితికాను పలకరించిన అనుష్క శర్మ ఒడిలో ఉన్న అహాన్ను ముద్దాడింది. అతని యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీడియో ఆఫ్ ది డే అంటూ క్యాప్షన్ ఇస్తున్నారు.

కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలు..
గతంలో టీమిండియా కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఉన్న సమయంలో రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నట్లు తరుచూ వార్తలు వచ్చేవి. మైదానంలో వారి ప్రవర్తన కూడా ఆ వార్తలకు బలం చేకూర్చేది. ఈ సమయంలోనే అనుష్క శర్మ, రితికా సజ్దే మధ్య మాటలు లేవని కూడా ప్రచారం జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. అంతేకాకుండా విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో ఈ ఇద్దరూ దూరంగా కూర్చోవడం.. కలిసి తిరగకపోవడం కూడా వీరి మధ్య మనస్పర్థలు ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేశాయి.
రితికా X అనుష్క
రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత కోహ్లీతో సంబంధాలు మెరుగుపడ్డాయి. దాంతో అనుష్క శర్మ, రితికా సజ్దేలు కూడా కలిసిపోయినట్లు తెలుస్తోంది. రితికా సజ్డే గతంలో విరాట్ కోహ్లీకి మేనేజర్గా పనిచేసింది. దాంతో ఈ ఇద్దరి మధ్య కాస్త చనువు ఉంది. అయితే ఈ చనువు అనుష్క శర్మకు కోపం తెప్పించిందనే పుకార్లు కూడా వెలువడ్డాయి. ఈ క్రమంలోనే రితికాతో అనుష్క దూరంగా ఉందనే వాదన కూడా వినిపించింది. ఏది ఏమైనా ఇప్పుడు స్టార్ ఆటగాళ్లు సన్నిహితంగా ఉండటంతో పాటు వారి సతీమణులు కూడా కలిసిపోవడం శుభపరిణామం అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గతేడాదే రోహిత్ శర్మకు కొడుకు పుట్టిన విషయం తెలిసిందే.