
ముంబై: సెలబ్రిటీలుగా ఉండటం అంత ఈజీ కాదు. సాధారణ జీవితం గడపడం వారికి ఎంతో కష్టంతో కూడుకున్న పని. సైలెంట్ గా లైఫ్ లీడ్ చేస్తున్న.. సెలబ్రిటీల జీవితం మీద ఆసక్తి ఎక్కువ చూపడం సర్వ సాధారణంగా మారిపోయింది. సెలబ్రిటీలు కాలు బయటపెడితే చాలు.. ఆటోగ్రాఫులు, ఫొటోగ్రాఫులు అంటూ జనాలు మీదపడిపోతుంటారు. ఫొటోగ్రాఫర్లు అయితే రెప్పపాటులోనే పది ఫొటోలను క్లిక్ క్లిక్మనిపిస్తారు. వారి కాలి గోటి నుంచి జుట్టుకు వేసుకున్న రంగు వరకు ప్రతీదీ కెమెరాల్లో నిక్షిప్తం చేస్తారు. ఇది సెలబ్రిటీలకు మంచే చేసినా కొన్నిసార్లు మాత్రం ఇబ్బందిగా ఉంటుంది.
ఇలాంటి ఇబ్బందే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు ఎదురైంది. ముంబై జూహు నివాసంలోని బాల్కనిలో కోహ్లీ, అనుష్క దంపతులు సేదతీరుతుండగా.. ఓ ఫొటోగ్రాఫర్ అనుమతి లేకుండా ఫొటోలు తీశాడు. అంతటితో గాకుండా తమ పబ్లికేషన్స్లో వాడుకున్నాడు. ఇది చూసిన అనుష్క ఆ ఫొటోలను తన ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఎన్నిసార్లు చెప్పినా మారరా? మీరు పదేపదే మా గోప్యతకు భంగం కలిగిస్తూనే ఉన్నారు. ఇక చాలు, ఇలాంటివి తక్షణమే ఆపేయండి" అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

ఈ నెలలోనే అనుష్క తన బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండేందుకే విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ మీద ఆస్ట్రేలియా నుంచి భారత్కు తిరిగొచ్చాడు. ఇక అనుష్క గర్భంతో ఉన్న సమయంలోనూ అటు షూటింగ్ సెట్స్కు వెళ్తూనే మరోవైపు జిమ్లో వర్కవుట్లు చేస్తూ చెమటలు చిందిస్తున్నారు. దీనితోపాటు వైద్యుల సూచనలు, భర్త సహకారంతో యోగాసనాలు కూడా చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకోవడం అవి నెట్టింట వైరల్ అయ్యాయి.