టీమిండియా అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్ చరిత్ర సృష్టించాడు. 35 ఏళ్ల తర్వాత మాంచెస్టర్ వేదికగా టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్ర చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్తో అన్షుల్ కంబోజ్.. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. భారత్ తరఫున టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టిన 318వ ఆటగాడిగా అన్షుల్ కంబోజ్ నిలిచాడు.
భారత పేసర్లు ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్ గాయాలతో జట్టుకు దూరం కావడంతో అన్షుల్ కంబోజ్ ఈ అవకాశాన్ని అందుకున్నాడు. ఆకాష్ దీప్ తరహా శైలిలోనే బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతో ప్రసిధ్ కృష్ణను కాదని ఈ యువ పేసర్కు టీమిండియా మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. దాంతో అనిల్ కుంబ్లే సరసన ఈ యువ పేసర్ నిలిచాడు.

1990లో మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగానే అనిల్ కుంబ్లే టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అన్షుల్ కంబోజ్.. ఈ మైదానంలో తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. ఓవరాల్గా ఈ మైదానంలో అరంగేట్రం చేసిన 11వ ఆటగాడిగా అన్షుల్ కంబోజ్ నిలిచాడు. 51 ఏళ్ల తర్వాత ఈ ఘనతను అందుకున్న తొలి భారత పేసర్గా రికార్డ్ సాధించాడు. 1974లో మదన్ లాల్ ఇదే మైదానంలో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు.
హర్యానాకు చెందిన అన్షుల్ కంబోజ్.. గత సీజన్ రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీ క్రికెట్లో అన్షుల్ కంబోజ్ మెరుగైన రికార్డ్స్ ఉన్నాయి. జయ్ హజారే ట్రోఫీ 2023-24లో హర్యానా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 10 మ్యాచ్ల్లో 3.58 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు. 30 టీ20ల్లో 19.85 సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు. 25 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 20.20 సగటుతో 40 వికెట్లు తీసాడు. 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 22.89 సగటుతో 79 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఏ తరఫున రెండు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ సాధించాడు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగి ఉండటం అతని అదనపు బలం. దాంతోనే అతనికి టీమిండియా మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది.
ఐదు టెస్ట్ల సిరీస్లో 2-1తో వెనుకంజలో ఉన్న టీమిండియా.. సిరీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం కీలకం. ఈ మ్యాచ్లోనూ టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్కు దిగింది. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ నిలకడగా ఆడి తొలి సెషన్ను 78/0తో ముగించారు.